ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టుటెక్నాలజీ వినియోగంతో ప్రతిఒక్కరి జీవితంలో మార్పుఅవసరమైనంత మేరకే టెక్నాలజీని వాడుకోవాలిఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్లో మూడువేల చోట్ల్ల యాక్ట్ ఉచిత వైఫై స్పాట్లు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేపట్టి ప్రజల ఆరోగ్య సంబంధ అంశాలను డిజిటల్ రూపంలోకి మారుస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఇంటర్నెట్ వాడకం, డిజిటల్ వస్తువుల ఉపయోగంపై భిన్నాభిప్రాయలున్నా ప్రతీ ఒక్కరి జీవితంలో డిజిటల్ పాత్ర పెరిగిందన్నారు. యాక్ట్ ఫైబర్ నెట్ సౌజన్యంతో జీహెచ్ఎంసీలో ఏర్పాటుచేసిన మూడువేల ఉచిత వైఫై హాట్స్పాట్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ ఇంట్లో ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల వాడకం పెరిగి నేడు ఇన్మోటోన్మెంట్గా డిజిటల్ ప్రపంచం మారిందని అన్నారు.
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఎైత్తెన ప్రదేశాలకు వెళ్లి సిగ్నల్ కోసం తండ్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరాలు, పట్టణాల్లో కావాల్సినంత ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘సామాజిక మాధ్యమాలను ఉపయోగించనివారు ఇప్పుడు చాలా అరుదు. పిల్లలు, యువత కొన్ని సందర్భాల్లో ఇంటర్నెట్ను అతిగా వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్ సేవలపై సమాజంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఏదేమైనా మన రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు పెరిగాయి. యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్లు 3వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై కనెక్టివిటీ అందించడం అభినందనీయం. బహుశా దేశంలోనే మరే నగరంలోనూ ఈ స్థాయిలో ఉచిత వైఫై హాట్స్పాట్లు ఉండవు. ఇది విద్య, వైద్య సేవలకు ఉపయోగపడుతుంది’ అని అన్నారు.
టెక్నాలజీ, సోషల్మీడియా వాడకం గురించి మంత్రి కేటీఆర్ వివరిస్తూ.. ‘ఒకరోజు నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి నా కొడుకు ఫోన్చేసినా మాట్లాడలేదు. ఇంటికి వెళ్లాక నాన్నా.. మీకు ఫోన్ చేస్తే మాట్లాడలేదు. ఇక నేను కూడా ట్వీట్ చేయనా? అని అడిగాడు’ అని నవ్వుతూ చెప్పారు. యాక్ట్ ఫైబర్ సీఈవో బాలా మల్లాది మాట్లాడుతూ విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, సాధారణ ప్రజలకు హాట్స్పాట్లు ఉపయోగపడుతాయని తెలిపారు. వినియోగదారులు ఎంపిక చేసిన 3వేల హాట్స్పాట్లలో 25 ఎంబీపీఎస్ స్పీడ్తో 1 జీబీ డాటా వరకు ఉచితంగా వాడుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.