హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిపథంలో పరుగులు పెడుతూ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకొన్న హైదరాబాద్ మహానగరం పారిశుద్ధ్యంలోనూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధిలో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ ఎఫ్ఎస్టీపీల (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో 87 సెఫ్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన ఎఫ్ఎస్టీపీని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించి పారిశుద్ధ్యంపై అవగాహన కోసం రూపొందించిన పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మానవ రహిత పారిశుద్ధ్య నిర్వహణలో జలమండలి ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొంటూ మినీ ఎయిర్టెక్ మిషన్లను రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం ఎఫ్ఎస్టీపీల నిర్మాణంతో మరో మైలురాయిని అందుకున్నదని పేర్కొన్నారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంకుల్లోని మానవ వ్యర్థాలను శుద్ధిచేసి పర్యావరణానికీ ప్రజల ఆరోగ్యానికి నష్టం కలగకుండా చూసేందుకు ఎఫ్ఎస్టీపీలకు రూపకల్పన చేశారని వెల్లడించారు.
హైదరాబాద్లో గతంలో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను చెరువులు, కాలువలు, కుంటల్లో పారవేసి పర్యావరణానికి, ప్రజలకు తీవ్ర హాని చేసేవారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఆ పరిస్థితిని నివారించడానికి సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను శుభ్రపరిచే అధునాతన వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎఫ్ఎస్టీపీలను హైదరాబాద్తోపాటు మరో 71 ప్రాంతాల్లో నిర్మిస్తున్నామని వివరించారు. ఈ వాహనాల ఆపరేటర్లకు సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. వీరు నగరంలోని సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను సమీపంలోని ఎఫ్ఎస్టీపీల్లో డంప్ చేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యల బాధ తప్పుతుందని పేర్కొన్నారు. సెఫ్టిక్ ట్యాంకు వాహనాల ఆపరేటర్లకు, కార్మికులకు త్వరలోనే హెల్త్ కార్డులు అందజేస్తామని మంత్రి కేటీఆర్ హమీఇచ్చారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజన్, మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నేడు మహానగరంగా అవతరించిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గార్బేజ్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ను ఆధునిక పద్ధతుల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 18 గ్రామ పంచాయితీల్లో జలమండలి తాగునీటి సేవలు అందిస్తున్నదని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలను తరలించే వాహనాలతోపాటు ఎఫ్ఎస్టీపీల నిర్మాణం చేపట్టిందని వివరించారు. ప్రస్తుతం అంబర్పేట, నల్లచెరువు, పెద్దచెరువు, మిరాలం ట్యాంకు, ఖాజాగూడ, నానక్రామ్గూడ, నాగోల్, కాజాకుంటల్లోని ఎఫ్ఎస్టీపీల వద్ధ 80 కేఎల్డీ (కిలోలీటర్ పర్ డే) సామర్థ్యంతో 8 కో-ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించామని చెప్పారు. సెప్టిక్ ట్యాంకు వ్యర్థాల నిర్వహణ, క్లీనింగ్ కోసం 155313/14420 నంబర్లకు కాల్ చేసి సేవలను పొందవచ్చని దానకిశోర్ సూచించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, ఈడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.