అమీర్పేట్, సెప్టెంబర్ 25 : సమాజంలో అవినీతిని రూపుమాపాలంటే ప్రశ్నించే తత్వం పెరగాలని మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. అయితే, అవినీతికి తలొగ్గకుండా పని చేసే అధికారులను గుర్తించి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా పౌరులపై ఉన్నదన్నారు. అవినీతి రహిత సమాజం కోసం పని చేస్తున్న యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఆదివారం బేగంపేటలోని హోటల్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నిజాయితీ పరుల సంఖ్య పెరిగినప్పుడే సమాజం మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వ మాజీ అదనపు ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. ఇప్పటి సమాజంలో నిజాయితీతో పని చేయడమంటే ఎంతో ధైర్యం కావాలన్నారు. ‘నేను ప్రజల సేవకుడిని.. లంచం అంగీకరించను’ అంటూ ప్రచారం చేస్తున్న సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం తాసీల్దార్ కార్యాలయ ఆర్ఐ చిలకరాజు నర్సయ్య సహా 15 మందిని సంస్థ వ్యవస్థాపకులు రాజేంద్రపల్నాటి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.