ఉమ్మడి జిల్లాలో ఎనిమిదో రోజూ లాక్డౌన్ సంపూర్ణం
నిర్ణీత సమయంలోగా పనులు ముగించుకొని వెళ్తున్న జనం
సింగరేణి, కేటీపీఎస్,ఐటీసీలలో కొనసాగిన ఉత్పత్తి
నగరంలో పర్యటించిన సీపీ విష్ణు వారియర్
ఖమ్మం, మే 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లాక్డౌన్ 8వ రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రభుత్వం సడలింపునిచ్చిన సమయంలోనే ప్రజలు బయటకు వచ్చి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. ఉదయం పది గంటల వరకూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఆ తరువాత వీధులన్నీ గప్చుప్ అవుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచే కూరగాయల మార్కెట్, పాల కేంద్రాలు, నిత్యావసర దుకాణాల వద్ద జనం సంచారం పెరుగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత రహదారులపై వాహనాలతో సంచరించకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనవసరంగా వాహనాలతో బయటకు వచ్చిన వారిని మందలిస్తున్నారు. కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ బుధవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులు యథావిధిగా నడిచాయి. సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్, ఐటీసీ పరిశ్రమలు యథావిథంగా పనిచేసి ఉత్పత్తిని కొనసాగించాయి. భద్రాచలం రామాలయాన్ని కూడా అర్చకులు ఉదయం 10 గంటలకే మూసివేశారు. తగిన పత్రాలు పరిశీలించి ఆసుపత్రులకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతించారు.