కరోనాపై వ్యాక్సిన్ను మించిన ఆయుధం లేదు
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఫార్మా, టీకాల ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ ఎదగటం, జినోమ్ వ్యాలీ బయోటెక్నాలజీ హబ్గా నిలవటం శుభపరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి భారత్ బయోటెక్ను సందర్శించి వ్యాక్సిన్ తయారీని పరిశీలించారు. చిన్నారులపై కరోనా టీకా పరిశోధనల గురించి అడిగి తెలుసుకున్నారు. ముకు ద్వారా అందించే టీకా ప్రయోగాలను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ వ్యాక్సినేషన్ ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, అప్పుడే కరోనాను సమర్థంగా ఎదుర్కోగలమని చెప్పారు. మనతోపాటు తోటివారిని వైరస్ బారి నుంచి కాపాడేందుకు టీకాను మించిన ఆయుధం లేదని వెల్లడించారు. టీకాలు, బల్క్ డ్రగ్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ ఎదగటం అభినందనీయమని కొనియాడారు. ఇటీవలే హైదరాబాద్లో కేంద్రియ ఔషధ ప్రయోగశాల ఏర్పాటుకు అనుమతులు రావటం అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించిందని ప్రశంసించారు. భారత్ బయోటెక్ సిబ్బంది కృషిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లా, ఈడీ డాక్టర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.