భారతీయ ఔషధ రంగానికి ప్రధాన కేంద్రం హైదరాబాదే. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధి కూడా కొనసాగుతున్నది. అందుకే కరోనా విపత్తు సమయంలోనూ గణనీయమైన వృద్ధిని తెలంగాణ సాధించింది. మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణలోని ఫార్మా సంస్థలదే కీలక పాత్ర. టీకాలతోపాటు రెమ్డెసివిర్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఫావిపిరవిర్ వంటి ప్రాణాధార ఔషధాలను ఉత్పత్తి చేశాయి. ఐసీఎంఆర్ అనుమతించిన తొలి ఆర్టీపీసీఆర్ కిట్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అయ్యాయి. దీంతోపాటు అనేకానేక కంపెనీలు పీసీఆర్ కిట్లు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, వైరస్ను రవాణా చేసే పరికరాలు, రియేజెంట్స్, ఇతర ద్రావణాలను హైదరాబాద్ కేంద్రంగానే ఉత్పత్తి చేశాయి. ఇక దేశీయంగా మొట్టమొదటి వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ హైదరాబాదీ సంస్థే కావడం గర్వకారణం.
దేశంలోనే అతిపెద్ద ఆర్అండ్డీ క్లస్టర్గా, ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా జీనోమ్ వ్యాలీ నిలిచింది. దేశీయ టాప్-5 వ్యాక్సిన్ తయారీ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఇక మంత్రి కేటీఆర్ గతేడాది ఆగస్టు 4న జీనోమ్ వ్యాలీని సందర్శించి వ్యాక్సిన్ అభివృద్ధి ఏ దశలో ఉన్నదో కూడా పరిశీలించారు. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థల అధినేతలను, శాస్త్రవేత్తల బృందాలను ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఈ పర్యటన మరోసారి రుజువు చేసింది.