సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : ప్రజా రవాణాలో కీలకమైన ఆర్టీసీకి బడ్జెట్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆర్టీసీ పనైపోయిందంటూ విమర్శలు చేసిన ప్రతిపక్షాల అంచనాలను సీఎం కేసీఆర్ తారుమారు చేశారు. ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా తాజా నిధుల కేటాయింపుల్లో సర్కార్ ఏకంగా రూ.3వేల కోట్లు వెచ్చించింది. ఎవ్వరూ ఊహించని విధంగా బడ్జెట్ కేటాయించి కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారు. నష్టాల కారణంగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని భయపడిన కార్మికుల్లో.. భారీ బడ్జెట్ కేటాయింపుతో ధైర్యం నింపారు. గ్రేటర్లో సుమారు 21వేల మంది ఆర్టీసీపై ఆధారపడగా పరోక్షంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. తాజా తీపి కబురుతో కార్మికులు గ్రేటర్లోని బస్ భవన్, ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు అన్ని ఆర్టీసీ డిపోల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఊపిరిలూదారని ప్రశంసలు కురిపించారు.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఆర్టీసీని మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా సామాన్యుడికి మెరుగైన ప్రజా రవాణాను అందించడానికి వెనుకడుగు వేయలేదు. కార్మికులకు మెరుగైన జీతభత్యాలు ఇస్తూ.. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించింది.
ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన కార్గో పార్సిల్ సర్వీసులు ఇప్పటికే విజయవంతమయ్యాయి. ప్రజలు విస్తృతంగా కార్గో సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ బోర్డును కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నది. ఆర్టీసీకి ఈ బడ్జెట్లో రూ.1500 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. మరో రూ.1500కోట్ల బడ్జెటేతర నిధులు ఇచ్చి, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.3వేల కోట్ల నిధులను సమకూర్చాలని ప్రభుత్వం ప్రకటించింది.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని సర్కార్ కడుపులో పెట్టుకుని రక్షిస్తున్నది. కరోనా కష్టకాలంలో సిబ్బందిని ఆదుకుంది. బడ్జెట్లో ఆర్టీసీకి సరైన ప్రాధాన్యతనివ్వడం సంతోషంగా ఉంది. ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా రూ.3 వేల కోట్లు తెలంగాణ సర్కార్ కేటాయించింది. ఆర్టీసీని మూసివేస్తారని భయపడే ప్రతి కార్మికుడికి బడ్జెట్తో ధైర్యం నింపారు. – ఎన్. కమలాకర్ గౌడ్టీ ఎంయూ జోనల్ సెక్రటరీ.
ఎవరూ ఊహించని విధంగా సర్కార్ ఆర్టీసీకి భారీగా బడ్జెట్ కేటాయించింది. ఆర్టీసీ సిబ్బందికి ఇక ఏమీ కాదనే ధైర్యం వచ్చింది. ట్రాన్స్పోర్ట్పై విస్తృతంగా అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ కార్మికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని భరోసా కల్పించారు. ప్రైవేట్ పరం చేస్తారేమోనని ఒకింత అనుమానం అందరిలో ఉండేది. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేసి మాలో నూతనోత్తేజం నింపారు. -ఓ.సుధ, అసిస్టెంట్ మేనేజర్, ఎంజీబీఎస్.
ఇప్పటి వరకు ఎందరో సీఎంలు వచ్చారు. పోయారు. వారు ఆర్టీసీ అభివృద్ధికి చేసిందేమీ లేదు. ఒక్క కేసీఆర్ మాత్రమే ఆర్టీసీ రూపురేఖలు మార్చే చర్యలు చేపడుతున్నారు. భారీ బడ్జెట్ కేటాయించి ఆర్టీసీకి దన్నుగా నిలిచారు. సీఎం కేసీఆర్కు కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రూ.3వేల కోట్లు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. ఆర్టీసీపై ఆధారపడిన ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించారు. – టి.రవీందర్ రావు, కండక్టర్, ఎంజీబీఎస్.
ఆర్టీసీ సంస్థకు రూ.3 వేల కోట్లు కేటాయించడం సంతోషకరం. గతంలో ఏ ప్రభుత్వమూ ఆర్టీసీ సంస్థలను పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చింది. ఉద్యోగులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్ల సమస్యలను కూడా వెంట వెంటనే పరిష్కరిస్తూ.. సీఎం కేసీఆర్ సంస్థలో పనిచేస్తున్న వారికి అండగా నిలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. – కె.కృష్ణమూర్తి, కంటోన్మెంట్ డిపో మేనేజర్