హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఓ మందుబాబు నిర్లక్ష్యం కారణంగా విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయాడు. మరణంలోనూ అవయవదానంతో మరో 8 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 27న నిజాంపేటలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు. ఓ మందుబాబు ట్రాఫిక్ పోలీసులతో ఘర్షణకు దిగి హోంగార్డు, కానిస్టేబుళ్లను గాయపర్చాడు. కూకట్పల్లి స్టేషన్ ఏఎస్సై మహిపాల్రెడ్డి ఘటన వివరాలను సేకరిస్తుండగా.. మద్యం మత్తులో ఓ క్యాబ్ డ్రైవర్ వేగంగా వచ్చి అతడిని ఢీకొట్టాడు. మహిపాల్రెడ్డికి తీవ్రగాయాలై దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం అర్ధరాత్రి మరణించాడు. దుఃఖంలోనూ మహిపాల్రెడ్డి కుటుంబం.. ఆయన అవయవాలను ఎనిమిది మందికి దానం చేసింది. బుధవారం రాజేంద్రనగర్ బండ్లగూడ కిస్మత్పుర ప్రాంతంలో ఏఎస్సై అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పాడె మోశారు. మహిపాల్రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. కూకట్పల్లి పోలీసులు కారు డ్రైవర్పై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.