హుజురాబాద్ : సీఎం కేసీఆరే మా నాయకుడు అని, ఇంకో రెండు టర్మ్లు ఆయనే ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలందిస్తారని హుజురాబాద్ టీఆర్ఎస్వీ విభాగం విద్యార్థి నాయకులు స్పష్టం చేశారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి వేల కోట్లు సంపాదించిన ఈటల మళ్లీ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదని తేల్చిచెప్పారు. పదేపదే ఆత్మగౌరవం అని మాట్లాడే ఈటల ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదు అని ప్రశ్నించారు. చీమూ, నెత్తురు ఉంటే, ఏ తప్పూ చేయకుంటే రాజీనామా చేసి వచ్చి ప్రజాక్షేత్రంలో నిలబడాలని ఈటలకు సవాల్ విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గానికి స్వాతంత్ర్యం వచ్చి 15 రోజులైందన్నారు. నియోజకవర్గ విద్యార్థి నాయకులమంతా ఏకతాటిపై ఉన్నామన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటల నియంత అని మండిపడ్డారు. అసైన్డ్ భూములు కొని దొరికిపోయిన దొంగ ఈటల అని ధ్వజమెత్తారు. మొదట్నుంచీ ఈటల రాజేందర్ కొవర్ట్ వేషాలు వేశారని మండిపడ్డారు. విద్యార్థి నాయకుడు ప్రవీణ్ యాదవ్ను ఈటల రాజేందర్ చిత్రహింసలు పెట్టించాడు. ప్రవీణ్ యాదవ్ చనిపోవడానికి ఈటల రాజేందరే కారణమన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల మాత్రమే అభివృద్ధి చెందారు. ఈటలకు బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఆత్మగౌరవం అని పదేపదే మాట్లాడటంతో ఆ పదానికి విలువ తగ్గిపోతుందన్నారు. ఈటల చేసిన సాయాన్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చన్నారు. ప్రతీ ఇంటికి సాయం చేశానని ఈటల చెప్పడం అబద్ధమన్నారు. సాయం కంటే హానీనే ఎక్కువ చేశారు. ధర్మం గెలిచిందని నియోజకవర్గ ప్రజలంతా అనుకుంటున్నారు అని టీఆర్ఎస్వీ విభాగం నాయకులు తెలిపారు.