హైదరాబాద్ : తెలంగాణ యువత భవిషత్కు భరోసానిచ్చేది టీఆర్ఎస్ మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే ఆనాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పారో..అదే లక్ష్యంతో సీఎంగా కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ విద్యార్థి సంఘం నేతలు టీఆర్ఎస్లో చేరారు.
టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేర్నాక రమాకాంత్, పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా జాయింట్ సెక్రటరీ పోషంపల్లి రాకేష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల అనిల్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ..మంత్రిగా పని చేసిన సమయంలో ఈటల రాజేందర్ తమను బాగా వేధించారని చెప్పారు.
తమపై కేసులు పెట్టి కొట్టించారని, జైలుకు పంపారని, భయబ్రాంతులకు గురి చేశారనివ వారు తెలిపారు.ఈటల టీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరడంతో తాము టీఆర్ఎస్లో చేరి పని చేస్తామని తెలిపారు. హరీశ్ రావు మాట్లాడుతూ..నీళ్లు, నిధుల విషయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన రీతిలో లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. అదే రీతిలో నియామకాల విషయంలోను సీఎం కేసీఆర్ హామీ మేరకు ఇప్పటికే లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు.
ఇవి కాక కొత్తగా 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగంతో పాటు వేలకోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, కొత్త పరిశ్రమల స్థాపన జరుగుతోందన్నారు.
ఈ ప్రైవేట్ రంగంలోను రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. పార్టీ అన్ని విషయాల్లో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కె. వాసుదేవరెడ్డి, మొలుగు పూర్ణ చందర్, టేకుల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి