హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ నుంచి తప్పుకోవాలని, లేదంటే ఓడించి తీరుతామని ఈటల రాజేందర్కు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ బీసీ, దళిత సంఘాల ఐక్య వేదికలు అల్టిమేటం జారీ చేశాయి. ఏడేండ్లు మంత్రిగా అధికారం అనుభవించి తెలంగాణ ద్రోహులతో చేయి కలిపాడని దుమ్మెత్తిపోశాయి. దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బింగి రాములు, బీసీ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి మోహన్, సరిత సహా పలువురు సోమవారం ఈటలకు బహిరంగలేఖ విడుదల చేశారు. ఈటల మంత్రిగా ఉన్న కాలంలో ఉద్యమకారుల సంక్షేమం, అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని పట్టించుకోలేదని లేఖలో తెలిపారు. ఉద్యమంలో అనేకమంది ఉద్యమకారులు ఆస్తులను అమ్ముకుంటే అదే ఉద్యమం ముసుగులో ఈటల వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఈటల చేసిన ద్రోహాన్ని, మోసాలను హూజూరాబాద్ ప్రజలకు ఇల్లిలూ తిరిగి వివరిస్తామని, ఈటలను ఓడించేదాకా తాము విశ్రమించేది లేదని పేర్కొన్నారు.