‘నమస్తే’తో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తల్లి లక్ష్మి ..పై చిత్రంలో బర్రెకు గడ్డి వేస్తూ కనిపిస్తున్నది గెల్లు లక్ష్మి. ప్రస్తుత టీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తల్లి. ఒకసారి హిమ్మత్నగర్ సర్పంచ్గా పని చేసింది. కానీ, ఎక్కడా ఆమె అలా కనిపించదు. పేదింటి మహిళ ఎలా శ్రమిస్తుందో.. ఇప్పటికీ అలానే కష్టపడుతున్నది. వయసుపైబడినా అన్ని పనులూ ఆమే చేసుకుంటుంది. వంట, ఇంటి పనులు పూర్తి చేసి పొలానికి వెళ్తుంది. ఖాళీగా ఉంటే కూలీ పనులు చేస్తుంది. తనబిడ్డకు టికెట్ వచ్చినా.. ఆమె వ్యవహార శైలిలో మాత్రం ఎటువంటి మార్పులేదు. ఆమె అభిప్రాయం తీసుకుందామని ‘నమస్తే తెలంగాణ బృందం’ శుక్రవారం హిమ్మత్నగర్కు వెళ్లగా, ఆ సమయంలో ఇలా బర్రెలకు గడ్డి వేస్తూ కనిపించింది. ఆప్యాయంగా పలుకరించింది. ఓవైపు తన కొడుకు ముచ్చట్లు చెబుతూనే.. తన పనుల్లో నిమగ్నమైంది. ఇంతకు కొడుకు గెల్లు శ్రీనివాస్ గురించి ఆ తల్లి ఏమి చెబుతున్నదో
నా పేరు గెల్లు లక్ష్మి. ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ. కొడుకు శ్రీనివాస్ యాదవ్ మస్తు కష్టపడ్డడు. చిన్నప్పుడు ఆదివారం నాతో కలిసి కైకిలుకు అచ్చటోడు. ఇక్కడ (హిమ్మత్నగర్లో) ఐదో తరగతి సదివిండు. అటెన్క వీణవంకలో పన్నెండు సదివిండు. హైదరాబాద్లో మంచిగా సదివి జాబ్ చేత్తా అని పోయిండు. అక్కడ సదువుకుంటనే తెలంగాణ కోసం పోరాటం జేసిండు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నడు. నా కొడుకును బట్టలు ఇప్పించి నిలబెట్టి కొట్టిన్రు. బూటుకాళ్లతో తన్నిన్రు. నిజంగా చెప్తున్నా బిడ్డా.. ఒక్కోసారి దెబ్బలు తాళలేక ఏడ్సెటోడు. రాత్రంతా వావ్వావాయ్య అనెటోడు. అప్పుడప్పుడు వేడినీళ్లతో కాపు కాసేది.
అదేందోగాని కొడుకు మళ్ల తెల్లారితేచాలు పట్నం ఉరికెటోడు. నా కొడుకు కోసం పోలీసులు ఇంటికచ్చి చూసిపోయేటోళ్లు. నా కొడుకు ఇక్కడ లేడంటే వినటోళ్లు కాదు. సామాన్లు అటీటు ఎత్తేసేటోళ్లు. ఎక్కడ దాసినవో చెప్పంటూ బెదిరించెటోళ్లు. అప్పుడు కొడుకును ఏమిజేత్తరో అని భయపడ్డం. కానీ, నా కొడుకైతే ఎన్నడూ భయపడలే. తెలంగాణ కోసం కొట్లాడిండు. నా కొడుకేగాదు మేం కూడా అన్నింటికీ ఓర్సుకున్నం. ఎట్లయితే ఏంది? తెలంగాణ అయితే అచ్చిందికదా సారు. అవ్వతోడు జెప్తున్నా.. నా బిడ్డ మంచిగ సదువుకొని నౌకరీ చేత్తడనుకొన్నం కనీ, కేసీఆర్ సారు నా బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇత్తడని కలలో గూడ అనుకోలె.
మాకు అంతదూరం కోరిక గూడ లేకుండె. మా పరిస్థతి మాకు తెలువదా సారు! నా బిడ్డ పస్తులుండి సదువుకున్నడు. యాదవుల్లో గూడ మాది కొంచెం నాదాను బతుకే. ఎంతో మంది ఎన్నో పేర్లు వెట్టినా మా ఖర్మగిట్లనే ఉందనుకొని గట్లనే కష్టపడి బతికినం. ఇప్పుడు నా బిడ్డకు టికెట్ ఇచ్చిన్రని చెప్తే సంతోషపడ్డ. ఇప్పుడు మా హిమ్మత్నగర్ ఊరోళ్లంతా ఇంటికి వత్తన్రు. నా కులపోండ్లే కాదు. అందరూ శీనన్నను గెలిపియ్యాలంటున్రు. ఒక్కటైతే చెప్తా సారు మాకు కాైర్లెతే లేవు. ఖలేజా ఉన్నోళ్లం. అన్ని కష్టాలు చూసినం. ఇగ కొత్తగా చూసేదేమీ లేదు. మాకు డబ్బుల్లేవు నిజమే. కానీ కాళ్లకు బట్టగట్టుకొని ఇల్లిల్లూ తిరుగుత. తెలంగాణ కోసం నా బిడ్డ కట్టపట్టది చెప్త. ఓటు వేయాలని దండం పెట్టి అడుగుత. ఇక్కడ ఎవరినడిగినా నా కొడుకు గెలుత్తడని చెప్తున్నరు. గవే నా బిడ్డకు ఆశీస్సులనుకుంటున్న. పైన పెద్ద సారు (కేసీఆర్) ఉన్నరు.