హైదరాబాద్: తెలంగాణలో పండుగల సీజన్ ముగిసిన తర్వాతనే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు. పండుగల సీజన్ తర్వాతే తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు మరో 12 ఇతర రాష్ట్రాలు కూడా కరోనా మహమ్మారి ప్రభావం, భారీ వర్షాలు, వరదలు, పండుగల నేపథ్యంలో తమ రాష్ట్రాల్లో ఉపఎన్నికల నిర్వహణ శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులను మన్నించి ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేదు.
కానీ, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మాత్రం ఉపఎన్నికల నిర్వహణకు సుముఖత వ్యక్తంచేశాయి. తమ రాష్ట్రాల్లో కరోనా పూర్తిగా అదుపులో ఉందని పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. ఉపఎన్నికలు నిర్వహించే నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఏమాత్రం లేదని, పూర్తి స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బెంగాల్ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసీ బెంగాల్లో మూడు శాసనసభ నియోజకవర్గాలకు, ఒడిశాలో ఒక శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
ఈసీ షెడ్యూల్ ప్రకారం.. బెంగాల్లోని భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ నియోజకవర్గాలకు, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉపఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించాల్సిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. అందరి నుంచి లేఖలు స్వీకరించి ఈ నెల 1న సీఎస్లతో సమావేశమైంది.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల సీఎస్లు ఎన్నికల నిర్వహణకు విముఖత వ్యక్తంచేశారని ఈసీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పలు పరిశోధన సంస్థలు, సాంకేతిక నిపుణుల కమిటీలు, పలువురు నిపుణులు మూడో దశ కరోనా ప్రభావంపై ఇప్పటికే చేసిన హెచ్చరికలను కూడా దృష్టిలో పెట్టుకున్నామని పేర్కొన్నది. కేంద్రం కూడా మూడో దశ కరోనా ప్రభావం గురించి రాష్ట్రాలకు పలు సూచనలు, మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని ఈసీ గుర్తుచేసింది.
ఎన్నికలకు విముఖ తెలిపిన రాష్ట్రాల్లో 31 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపింది. రాజ్యాంగ అత్యవసరం, ప్రత్యేక విజ్ఞప్తి మేరకు పశ్చిమబెంగాల్లో ఉపఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నది.