భద్రాద్రి రాములోరి పెండ్లి పనులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు, అర్చకులు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించారు. ఏటా భద్రాచలంలోని మిథిలా ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు కొవిడ్ కారణంగా ఈ సారి కూడా పరిమితంగా నిర్వహించాల్సి వస్తున్నది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 21న జరిగే కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ శ్రీసీతారామచంద్రస్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. భక్తులకు కల్యాణ, సాధారణ లడ్డూలను అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రసాదం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్శాఖ ద్వారా అందజేయనున్నది.
ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దక్షిణ అయోధ్యగా పేర్గాంచిన భద్రాద్రిలో వచ్చే నెల 21న నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు జరుగనున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఆలయ అధికారులు గతేడాదిలో నిర్వహించినట్లు ఈ సారి కూడా ఆలయ ప్రాంగణంలోనే సంప్రదాయబద్ధంగా శ్రీసీతారాముల కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఏటా భద్రాచలంలోని మిథిలా నగరంలో అట్టహాసంగా జరిగే ఈ వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా శ్రీసీతారాముల వివాహాన్ని ప్రతి భక్తుడు కన్నులారా వీక్షించి రామయ్య కటాక్షం పొందేవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1969 నుంచి ఏటా అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలను రెండోసారి అతితక్కువ మంది మధ్య నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుండగా కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించాల్సిన పరిస్థితి.
గతేడాది కొవిడ్ విజృంభించిన నేపథ్యంలో ఏప్రిల్ 2న ఆలయ అధికారులు అర్చకులు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని మిథిలా స్టేడియంలో కాకుండా దేవాలయ ప్రాంగణంలోనే నిర్వహించారు. ఈసారి కూడా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ సన్నిధిలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నప్పటికీ కొవిడ్ నేపథ్యంలో మూడు రోజులుగా ప్రసాదాన్ని మాత్రమే అందిస్తున్నారు. వేడుకలకు భక్తులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఈ ప్రభావం వ్యాపార, వాణిజ్య సముదాయాలపై పడనుంది. అర్చకులు, ప్రధాన అర్చకులు, విశిష్ట అతిథుల మధ్య వేడుకలు జరుగుతాయని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. శ్రీరాముడి కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించాలని భక్తులను కోరారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
గతంలో ఏర్పాట్లు ఇలా..
రెండేళ్ల క్రితం వరకు ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణానికి లక్షలాది మంది భక్తులు భద్రాచలానికి వచ్చేవారు. తెలుగు రాష్ర్టాల నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు విచ్చేవారు. పట్టణమంతా సందడిగా మారేది. కలెక్టర్ పర్యవేక్షణలో ఆలయ అ ధికారులు, జిల్లా అధికారులు భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించేవారు. భద్రాచలం దేవస్థానం, ప్రభు త్వం కలిసి సుమారు రూ.2 కోట్ల నిధులు వెచ్చించి అట్టహాసంగా వేడుకలు నిర్వహించేవారు. ఈ వేడుక చూసేందుకు 23 వేల టిక్కెట్లను విక్రయించేవారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీల్లో 17 వేల మంది భక్తులు మహోత్సవాన్ని వీక్షించేవారు. శ్రీరంగం నుంచి పట్టువస్ర్తాలు తెప్పించి సీతారాములకు సమర్పించేవారు.
పెండ్లి పనులకు శ్రీకారం
ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం వసంతోత్సవం సందర్భంగా రాములోరి పెండ్లి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. డోలోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది కల్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శ్రీసీతారామచంద్రస్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. భక్తులకు కల్యాణ, సాధారణ లడ్డూలను అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ప్రసాదం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్శాఖ ద్వారా అందజేయనుంది.
కల్యాణానికి ఏర్పాట్లు
ఏప్రిల్ 21న జరిగే శ్రీసీతారామకల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కొవిడ్ నేపథ్యంలో నిరాడంబరంగా ఆలయ ప్రాంగణంలోని శాస్ర్తోక్తంగా నిర్వహిస్తాం. కల్యాణానికి అవసరమైన దీక్షా వస్ర్తాలు, తలంబ్రాలు, ఇతర వస్తువులను సమకూరుస్తున్నాం. స్వామివారికి ప్రభుత్వం నుంచి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్ర్తాలు లాంఛనంగా అందుతాయి.