అనాథలైన ఐదుగురు ఆడ పిల్లలు
దుబ్బాక, జూలై 31 : ప్రియుడి మోజులో ఓ ఇల్లాలు దారుణానికి ఒడిగట్టింది.. ఐదుగురు ఆడపిల్లలున్న సంగతి కూడా మర్చిపోయి కిరాతకంగా వ్యవహరించింది. లోకంలో తండ్రి లేక.. తల్లి జైలు పాలు కావడంతో ఆ ఆడపిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దుబ్బాక మండలం దుంపలపల్లిలో గురువారం గొర్రెల కాపారి దొందడి రెడ్డయ్య(45) హత్యకు గురి కాగా, పోలీసులు 48 గంటల్లో కేసును ఛేదించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించారు.
శనివారం దుబ్బాక పోలీస్స్టేషన్లో సిద్దిపేట ఏసీపీ సైదులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. దుంపలపల్లికి చెందిన దొందడి రెడ్డయ్య-తిరుపతమ్మ దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు. రెడ్డయ్య తనకున్న రెండెకరాల పొలంలో పంట సాగు చేయడంతోపాటు గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెడ్డయ్య భార్యకు అదే గ్రామానికి చెందిన అఫ్రోజ్ అలియాస్ అప్పుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.
తన భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడు అఫ్రోజ్తో సుఖంగా ఉండొచ్చని, అతన్ని చంపేస్తే రైతుబీమా రూ.5 లక్షలు కూడా వస్తాయని భావించింది. భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి పథకం రచించింది. అందులో భాగంగానే ఐదురోజుల క్రితం తమ బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి పిల్లలను వెంట తీసుకెళ్లింది. ఆ మరుసటి రోజు అఫ్రోజ్కు తిరుపతమ్మ ఫోన్ చేసి, తన భర్తను చంపేయ్ అని చెప్పింది. బుధవారం రాత్రి అఫ్రోజ్ మద్యం తాగుదామని, రెడ్డయ్యను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.
గ్రామ శివారులో దుంపలపల్లి-ధర్మారం రోడ్డులో రెడ్డయ్యకు మద్యం బాగా తాగించాడు. అతడి టవల్తోనే రెడ్డయ్య మెడకు ఉరి వేసి హతమార్చాడు. గురువారం వేకువజామున అటుగా వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో దుబ్బాక పోలీసులకు సమాచారమిచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, చాకచక్యంగా తిరుపతమ్మ, అఫ్రోజ్ను పట్టుకొని రిమాండ్కు తరలించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన దుబ్బాక ఎస్సై స్వామి, పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.