మెదక్ : పల్లె ప్రగతిలో అధికారుల పనితీరు మారకపోతే వేటు తప్పదని జిల్లా కలెక్టర్ హరీష్ హెచ్చరించారు. సోమవారం పెద్దశంకరంపేట మండలపరిధిలోని ఆరెపల్లి, జంబికుంట, కమలాపురం, బుజ్రాన్పల్లి, పెద్దశంకరంపేట, గ్రామాల్లో పల్లెప్రగతి పనులను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోనే హరితహరం మొక్కలను, పల్లెప్రకృతి వనాలను, వైకుంఠ ధామాలను, పరిశీలించారు. ఆరెపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో నిర్వహణ సరిగ్గా లేదని మొక్కలను సరిగ్గా నాటడం లేదని, కలుపు మొక్కలు తీయడం లేదని స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీవోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధులు సక్రమంగా నిర్వహించని సర్పంచ్లు, అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నామన్నారు. త్వరలోనే జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా ఉన్నతాధికారులు పర్యటిస్తారని పనితీరులో సంతృప్తి చెందకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. గత 5 రోజులుగా గ్రామంలో ఎలాంటి పనులు నిర్వహించారని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి పంపిణీ చేసే హరితహరం మొక్కల లెక్కల్లో పొంతన లేదని ఎంపీవో రియాజొద్దిన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి 6 మొక్కలను అందజేయాలని ఆయా గ్రామాల సర్పంచ్లకు సూచించారు. జంబికుంటలో మొక్కలు నాటి పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు. మండలంలో వైకుంఠధామాల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని త్వరలో వినియోగంలోకి తీసుకరావాలన్నారు. పెద్దశంకరంపేటలో పల్లెప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు తక్కువగా ఉన్నాయని గ్రామంలో అపరిశుభ్రత వాతావరణం నెలకొందని ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీడీవో స్థానికంగా ఉన్నప్పటికీ పర్యవేక్షణ చేయడం లేదన్నారు. గత 5 రోజులుగా పల్లెప్రగతి కార్యక్రమంలో ఏఏ పనులు చేపట్టారని అడిగి తెలుసుకున్నారు. బుజ్రాన్పల్లి, జంబికుంట గ్రామంలో పల్లెప్రకృతి వనాల నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్లు సత్యనారాయణ, రాములు, సాయమ్మ, బూదెమ్మ, రుక్మిణి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం