కరోనాతో అమ్మా, నాన్న, నానమ్మను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలిచిన కాలనీవాసులు
తుర్కయాంజాల్, మే 10: కరోనా కుటుం బాన్ని కబలించడంతో అనాథలైన చిన్నారులకు అండగా నిలిచారు కాలనీవాసులు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మన్నెగూడ ఎవెన్స్ కార్నర్కు చెం దిన దండెం గోపాల్రెడ్డి పొలాల చుట్ట్టూ ఫెన్సింగ్ వేసే కాంట్రాక్టర్. వీరి కుటుంబం 15 రోజుల క్రితం కరోనా బారిన పడింది. గోపాల్రెడ్డి తల్లి దండెం భారతమ్మ(69) తొలుత మృతి చెందింది. తల్లి చనిపోయిన మూడు రోజులకు గోపాల్రెడ్డి(48) కూడా ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అప్పటికే వైరస్ సోకి కోమాలో ఉన్న గోపాల్రెడ్డి భార్య దీప(41) పది రోజుల తరువాత మరణించింది. ఇంట్లోని ముగ్గురు కుటుంబ పెద్దలు రెండు వారాల వ్యవధిలో మృత్యువాత పడటంతో చిన్నారులు సాత్విక్ (12), హన్వీ (3) అనాథలయ్యారు. మీకు మేమున్నామంటూ.. కాలనీవాసులు అక్కున చేర్చుకున్నారు. ఆ పిల్లల భవిష్యత్ కోసం చందాల రూపంలో రూ.3.5 లక్షలు పోగేసి, నిధిని సమకూర్చారు. ఆపత్కాలంలో చిన్నారులను ఆదుకొని ఆదర్శంగా నిలిచిన కాలనీవాసులను పలువురు ప్రశంసిస్తున్నారు.