హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): గణితంలో సత్వర మార్గాలు లేవు.. కానీ దాన్ని అర్థం చేసుకుంటే వేగంగా పరిష్కరించవచ్చని ప్రపంచ అత్యంత వేగవంతమైన మానవ క్యాలిక్యులేటర్ నీలకంఠ భానుప్రకాశ్ తెలిపారు. బహ్రెయిన్ తెలుగు కళా సమితి అక్కడి విద్యార్థుల కోసం హైదరాబాద్కు చెందిన భానుప్రకాశ్తో వర్చువల్ కార్యక్రమాన్ని నిర్వహించిం ది. గణితానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేయడంతోపాటు ప్రశ్నలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పరిష్కరించాలనే విషయాలను భానుప్రకాశ్ వివరించారు. విద్యార్థుల సం దేహాలను నివృత్తిచేశారు. గణితాన్ని సంగీతం, కళలు, సంస్కృతితో మేళవించి ఆసక్తికరంగా ఎలా మలచవచ్చనే అంశంపై చర్చించారు. తెలుగు కళా సమితి అధ్యక్షుడు శివ యెల్లపు, వ్యవస్థాపక సభ్యుడు రఘునాథబాబు, సమన్వయకర్త దీపక్ నంద్యాల ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది.