హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కొత్త పీఆర్సీ అమల్లోకి రావటంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. వారితోపాటే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్ కూడా గౌరప్రద స్థాయిలో పెరిగింది. పెంచిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి రావటంతో ఆయా ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన తర్వాత తొలిసారి ఏర్పడిన వేతన సవరణ సంఘం (పీఆర్సీ).. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను పూర్తిగా పరిశీలించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, రాష్ట్రంలోని రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా లబ్ధిచేకూరేలా పీఆర్సీ సిఫారసులకంటే నాలుగు రెట్లు.. 30% ఫిట్మెంట్ ప్రకటించారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలుచేయాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన ఫిట్మెంట్ 2018 జూలై నుంచి అమల్లోకి వస్తుంది. 2018 జూలై నుంచి మానిటరీ బెనిఫిట్, 2020 ఏప్రిల్ నుంచి 2021 ఏప్రిల్ వరకు క్యాష్ బెనిఫిట్ అమలు చేయాలని నిర్ణయిచింది. దీంతోపాటు ప్రతి ఉద్యోగికి మూడు ఇంక్రిమెంట్లు కలుస్తాయి.
పెన్షనర్లకు ఇలా..
పెన్షనర్లకు పీఆర్సీతో మంచి లబ్ధి జరిగింది. పీఆర్సీ సిఫారసుల ప్రకారం 70 ఏండ్లు దాటిన పెన్షనర్లకు అదనంగా 15% పెన్షన్ పెంచారు. 2000 జనవరిలో రిటైర్ అయిన ఉద్యోగి 2015 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం రూ.43 వేల పెన్షన్ తీసుకుంటున్నారు. కొత్త పీఆర్సీతో మరో 13 వేలు అదనంగా పెన్షన్ వస్తుంది. 2008 జూలైలో రిటైర్ అయిన సీనియర్ రెవెన్యూ అధికారికి ప్రస్తుతం రూ.57,445 పెన్షన్ వస్తున్నది. వారికి కొత్త పీఆర్సీలో దాదాపు రూ.27 వేల వరకు పెన్షన్ పెరుగుతుంది. దీనికి ఇంక్రిమెంట్లు కలిపితే రూ.79వేల వరకు పెన్షన్ వస్తుంది. ఇటీవల రిటైర్ అయిన వివిధ స్థాయిల అధికారులకు సర్వీసులో ఉండగా లక్షకు పైగా వేతనాలు వస్తున్నాయి. వీరికి ఇందులో సగం వేతనం పెన్షన్ ఇస్తారు. ప్రస్తుతం అందుకుంటున్న పెంచిన ఫిట్మెంట్ దామాషా పద్ధతిలో పెన్షన్ పెరుగుదల ఉంటుంది. దీంతో వారికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెన్షన్ వస్తుందని ఒక పెన్షనర్ తెలిపారు. పెన్షన్లను క్యాటగిరీలుగా చూడలేమని, రిటైర్ అయినప్పుడు ఉన్న వేతనం ఆధారంగా పెన్షన్లు ఉంటాయని చెప్పారు.
వేతనాల పెరుగుదల ఇలా..
నాలుగో తరగతి ఉద్యోగికి బేసిక్ పే రూ.13,000 ఉండి, డీఏ 30.392%, హెచ్ఆర్ఏ 14.5% ఉన్నవారికి 2018 జూలై నాటికి రూ.5,117 ప్రయోజనం కలుగుతుంది. దీనికి 2021 జూన్ నాటికి మూడు ఇంక్రిమెంట్లు కలుస్తాయి. అలాగే రికార్డు అసిస్టెంట్కు సమానస్థాయి మూడో తరగతి ఉద్యోగికి బేసిక్ పే రూ.15,030 ఉంటుంది. ఈ ఉద్యోగికి ఈ పీఆర్సీలో రూ.6,024 వేతనం పెరుగుతుంది. సీనియర్ అసిస్టెంట్ స్థాయి రెండో తరగతి ఉద్యోగికి బేసిక్పే రూ.22,460 ఉంటుంది. ఈ పీఆర్సీలో రూ.9,536 నెట్ బెనిఫిట్ కలుగుతుంది. గ్రూప్-1 అధికారి బేసిక్ పే రూ.37,100 నుంచి 91,450 వరకు ఉంటుంది. ఈ పీఆర్సీలో రూ.15,495 వేతనం పెరుగుతుంది. వీరందరికీ పెరిగిన వేతనంతోపాటు మూడు ఇంక్రిమెంట్లు కలుస్తాయి. దీని ప్రకారం రూ.13,000 వేతనం ఉన్న నాలుగో తరగతి ఉద్యోగి వేతనం జూన్ నుంచి రూ.20,920కి పెరుగుతుంది. రూ.15,030 ఉన్న మూడో తరగతి ఉద్యోగి వేతనం రూ.24,280కి పెరుగుతుంది. రూ.22,460 వేతనం ఉన్న రెండో తరగతి ఉద్యోగి వేతనం రూ.36,750 అవుతుంది. రూ.37,100 వేతనం ఉన్న గ్రూప్-1 అధికారికి రూ.60,480కి పెరుగుతుంది. రూ.51,230 వేతనం ఉన్న ఉద్యోగికి రూ.83,100కు పెరుగుతుంది. రూ.61,450 ఉన్నవారికి రూ.99,310కి, రూ.80,930 ఉన్నవారికి రూ.1,34,470కి, రూ.1,00,770 వేతనం ఉన్నవారికి రూ.1,62,070కి, రూ.1,62,070 ఉన్నవారికి 1,93,317కు వేతనాలు పెరుగుతాయి.