ఫతేపూర్ : ఉత్తర ప్రదేశ్లోని ఫతేఫూర్ జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడి చేసి పరారయ్యాడు. ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం సాయంత్రం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఫతేపూర్ నగర పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సత్యేంద్రసింగ్ తెలిపారు. బాధితురాలి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని, వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు పంపామని పేర్కొన్నారు.
2019 జులైలో బాధితురాలి తల్లి నిందితుడి సోదరుడితోపాటు పలువురు తనపై అత్యాచారం చేశారని కేసు పెట్టింది. ఈ కేసులో ఇప్పటికే చార్జీషీటు దాఖలు చేసినట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. గతేడాది డిసెంబర్లోనూ బాధితురాలి తల్లి మరో ఇద్దరిపై ఇదే తరహాలో కేసు పెట్టి తరువాత రాజీ కుదుర్చుకొని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ సత్యేంద్ర సింగ్ పేర్కొన్నారు.