హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తున్నది. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయి. తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజును, రోడ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని రవాణాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుగానే ఎంతో ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించిందని, కేంద్ర ప్రభుత్వ పాలసీ కంటే రాష్ట్ర ప్రభుత్వ పాలసీ చాలా భేషుగ్గా ఉన్నదని కొనుగోలుదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఈవీలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నిటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదా యం తగ్గినప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.