జమ్మికుంట/హుజూరాబాద్ రూరల్/కమలాపూర్/వీణవంక, ఆగస్టు 6: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రోజురోజుకూ బలపడుతున్నది. కుల సంఘాలతోపాటు ఇతర సంఘాల వారు గులాబీ పార్టీకి బాసటగా నిలుస్తుండటంతో పార్టీ శ్రేణు ల్లో నూతనోత్సాహం నెలకొన్నది. సబ్బండ వర్గాలు ప్రగతి ప్రదాత సీఎం కేసీఆర్ వెంటే ఉంటామంటూ స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయఢంకా మోగిస్తామని పార్టీ యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తున్నది. శుక్రవారం జమ్మికుంట మండలం వావిలాల, కోరపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 200 మంది టీఆర్ఎస్లో చేరగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోరపల్లి సర్పంచ్ రమ, ఉప సర్పంచ్ ఓదెలు, 9 మంది వార్డుసభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసి మద్దతు ప్రతిని ఎమ్మెల్యేకు అందజేశారు. మండలంలోని వావిలాలకు చెందిన 59 మంది డప్పు కళాకారులు, వావిలాల, గోపాలపురం గ్రామాలకు చెందిన కురుమ సంఘాల నాయకులు, భవన నిర్మాణ తాపీ కార్మిక సంఘం నాయకులు 80 మంది గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు కష్టాలు పడ్డ దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు కు సీఎం కేసీఆర్ అంకురార్పణ చేశారన్నారు. బీజేపీకి ఓటేస్తే ఒరిగేదేమి లేదని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల ని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థికి అండగా నిలిచి అభివృద్ధిని సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపెల్లి శ్రీనివాస్రావు, జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ శ్యాం పాల్గొన్నారు.
మరికొన్నిచోట్ల భారీగా చేరికలు..
హుజూరాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లెకు చెందిన 30 మంది బీజేపీ నాయకులు శుక్రవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారంతా ‘జై టీఆర్ఎస్.. జై జై కేసీఆర్’ అంటూ నినదించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్లో చేరామని వారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వెంట ఉంటూ పార్టీ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల, కానిపర్తి, దేశరాజ్పల్లి గ్రామాల్లో దళిత కాలనీల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. కమలాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం నాయకులు 20 మంది పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇంచార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కానిపర్తికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఈసంపల్లి ఉపేందర్తోపాటు 50 మంది, అంబాలకు చెందిన 50 మంది టీఆర్ఎస్లో చేరారు. వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.