హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సంకల్పంతో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మహర్ధశ పట్టిందని.. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులతో మిల్లింగ్, అనుబంధ రంగాలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పసిడి పంటలతో తులతూగుతున్న తెలంగాణ ఇక పంటలను ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేసే అవకాశాల వైపు ద్రుష్టి సారిస్తుందన్నారు. కాళేశ్వరంతో ఇటు సాగునీటితో పాటు పరిశ్రమలకు అవసరమైన నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని, సంవత్సరానికి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా పండుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడంలో సైతం తెలంగాణ అంతే వేగంగా అడుగులు వేస్తుందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్, సాల్వెంట్ ఆయిల్ ఉత్పత్తిదారులు గురువారం మంత్రితో మర్యాదపూర్వకంగా బేటీ అయ్యారు .
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రైస్ మిల్లులు గణనీయంగా పెరగబోతున్నాయన్నారు. తద్వారా బై ప్రోడక్టుగా ఉత్పత్తయ్యే తవుడుని ప్రాసెసింగ్ చేసి రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయన్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లులతో పాటు రైస్ బ్రాన్, సాల్వెంట్ ఆయిల్ రిపైనరీ పరిశ్రమలకు గల అవకాశాల్ని మంత్రి వారికి వివరించారు. ఈ మిల్లులు ఏర్పాటు చేసేవారికి పుడ్ ప్రాసెసింగ్ జోన్లలో అవకాశం కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా అందజేస్తుందని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాల్ని ఉపయోగించుకోవాలన్నారు. పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే స్థానికంగా ఉత్పత్తయ్యే వ్యవసాయ ఉత్పత్తులకు విలువను పెంచడం ద్వారా రైతులకు, ఉపాది అవకాశాలు పెంచడం ద్వారా యువతకు అవకాశాలు కల్పించడం వంటి బహుళ ప్రయేజనాలు ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు.
మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మిల్లింగ్ బై ప్రోడక్ట్ అయిన తవుడు ద్వారా 20 శాతం రైస్ బ్రాన్ ఆయిల్తో పాటు 80 శాతం పౌల్ట్రీ, ఆక్వా దానా తయారవడమే కాక జీరో వేస్టేజ్ ఉంటుందన్నారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ లో ఎన్నో మంచి ఆరోగ్య కారకాలు ఉన్నాయన్నారు. తక్కువ కొలేస్ట్రాల్ తో పాటు కాన్సర్, రక్తపోటు వంటి అనేక రుగ్మతలు రాకుండా ఈ ఆయిల్ నియంత్రిస్తుందని రుజువయిందన్నారు. ప్రత్యేక పుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ఇటువంటి అవకాశం కల్పించినందుకు మంత్రి గంగుల కమలాకర్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు వారు ఈ సందర్భంగా ప్రత్యేక క్రుతజ్ణతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంపా నాగేందర్, సాల్వెంట్ ఆయిల్ మిల్లుల ప్రతినిధులు మారం ప్రసాద్, పాలకుర్తి చినబాబు, ఆనంద్ మోహన్ పాల్గొన్నారు.