హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): స్కూల్లో క్రమశిక్షణ పాటిస్తూ కష్టపడి చదివే విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చి ప్రోత్సహిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంది. జనాభాను నియంత్రిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, సొంత రాబడిని పెంచుకుంటూ పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ర్టాలకు నిధుల వాటాలో కోత పెడుతున్నది. ఇందుకు ఆర్థిక సంఘం సిఫారసులను సాకుగా చూపుతున్నది. దీంతో తెలంగాణ వంటి రాష్ర్టాలు భారీగా నష్టపోతున్నాయి. తాజాగా 15వ ఆర్థిక సంఘం 2021-26 సంవత్సరాలకు సంబంధించి చేసిన సిఫారసుల కారణంగా తెలంగాణ మరోసారి భారీగా నష్టపోయే అవకాశం ఉన్నది. కేంద్ర పన్నుల వాటాలో 2019-20 వరకు తెలంగాణకు 2.44 శాతం వస్తుండగా.. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో అది 2020-21లో 2.33శాతానికి తగ్గింది. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం రాష్ర్టానికి ఇచ్చిన వెయిటేజీని మరింత తగ్గించింది. దీంతో కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు ఇకపై 2.102శాతం మాత్రమే దక్కనున్నది. చెప్పుకోవడానికి 2.102 శాతమే అయినప్పటికీ దీని విలువ ఏటా రూ.2,405 కోట్లు. వచ్చే ఐదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్ల నష్టం. రాష్ట్రంలో జనాభా పెరుగుదల నియంత్రణలో ఉన్నందుకు, ఆర్థిక పురోగతిలో ఇతర రాష్ర్టాలకంటే మెరుగ్గా ఉన్నందుకు వెయిటేజీతోపాటు పన్నుల వాటాను కూడా ఆర్థిక సంఘం తగ్గించింది.
జనాభాకు 14వ ఆర్థిక సంఘం 10శాతం వెయిటేజీనివ్వగా 15వ ఆర్థిక సంఘం దానిని 15శాతానికి పెంచింది. ఇంతకుముందు 1971 నాటి జనగణనను ప్రాతిపదికగా తీసుకున్న ఆర్థిక సంఘం ప్రస్తుతం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నది. దీంతో తెలంగాణ, కర్ణాటక, మిజోరాం వంటి రాష్ర్టాలకు నష్టం జరిగింది. ప్రభుత్వాలు తీసుకున్న కుటుంబ నియంత్రణ చర్యలవల్ల సంతాన వృద్ధిరేటు బాగా తగ్గింది. ఉదాహరణకు జాతీయ సంతాన వృద్ధిరేటు ఒక మహిళకు సగటున 2.2శాతంగా ఉంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ర్టాలలో 1.7శాతంగా ఉంది. అధిక జనాభా ఉన్న రాష్ర్టాలకు 15శాతం వెయిటేజీ ఇవ్వడం వల్ల తక్కువ జనాభా ఉన్న రాష్ర్టాలు నష్టపోతున్నాయి. నష్టపోతున్న రాష్ర్టాలకు పరిహారంగా స్పెషల్ గ్రాంట్లను మంజూరు చేయాలని 15వ ఆర్థిక సంఘం 2020-21సంవత్సరానికి సిఫారసు చేసింది. కోతలకు సంబంధించి ఆర్థిక సంఘం సిఫారసులను అమలుచేస్తున్న కేంద్రం కేటాయింపు విషయంలో మాత్రం పాటించకపోవడం గమనార్హం. జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ర్టాలకు ‘డెమోగ్రాఫిక్ ఫర్ఫార్మెన్స్’కింద 12.5శాతం వెయిటేజీ ఇచ్చింది. ఇది కొంతవరకు తెలంగాణకు అనుకూలం. కానీ ఇందులో జనాభా నియంత్రణతో పాటు కేంద్రం ట్యాక్స్ ఎఫోర్ట్, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్లను ముడిపెట్టింది.
కేంద్ర పన్నుల వాటాల కేటాయింపులో ప్రాధాన్యక్రమాలను మార్చాలని, 41 నుంచి 50 శాతానికి పెంచాలని తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలు మొదటి నుంచీ కోరుతున్నాయి. ప్రజల అవసరాలకు ఆయా ప్రభుత్వాలు వెచ్చించే ‘క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండీచర్’ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాయి. ప్రస్తుతం పెట్టుబడి వ్యయానికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వడంలేదు. ఆ అంశానికి కనీసం 7.5 శాతం వెయిటేజీ ఇవ్వాలని కోరుతున్నాయి. ప్రస్తుతం జనాభా అంశానికి 15శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15శాతం, అడవులు, పర్యావరణానికి 10శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఉత్తర, ఈశాన్య రాష్ర్టాలలో సహజంగా దట్టమైన అడవులు ఎక్కువగా ఉంటాయి. తెలంగాణ వంటి పట్టణవాసం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలలో దట్టమైన అటవీ విస్తీర్ణం తక్కువే. అడవుల విస్తీర్ణానికి గంపగుత్తగా మార్కులివ్వకుండా ఆయా ప్రభుత్వాలు పచ్చదనాన్ని పెంచడానికి, అడవుల పునరుద్ధరణకు, అటవీ సంపదను సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను, వెచ్చిస్తున్న వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ర్టాలు కోరుతున్నాయి. సొంత రాబడులను పెంచుకొంటూ.. ఆర్థిక స్వయంసమృద్ధి సాధిస్తున్న రాష్ర్టాలకు ‘ఫిస్కల్ రిలయన్స్’ అనే అంశాన్ని చేర్చి 10శాతం వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ మొదటినుంచి వాదిస్తున్నది. కానీ 15వ ఆర్థిక సంఘం ఈ అంశానికి 2.5శాతం మాత్రమే వెయిటేజీ ఇచ్చింది.
నిధుల కేటాయింపులో ఆర్థిక సంఘాలు అనుసరిస్తున్న వెయిటేజీ ప్రాతిపదిక తీవ్ర నష్టం తెస్తున్నది. ఈ ప్రాతిపదికను మార్చాలని ఎన్నిసార్లు విన్నవించినా అటు కేంద్రం, ఇటు ఆర్థిక సంఘాలు పట్టించుకోలేదు. ఆదాయ అంతరాన్ని ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటుండం వల్ల జనాభా ఎక్కువ ఉన్న రాష్ర్టాలకు, ఆదాయం తక్కువగా ఉండి లోటు బడ్జెట్ ఉన్న రాష్ర్టాలకు కేంద్ర నిధుల వాటా పెరుగుతున్నది. కేంద్రంపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత రాబడులను పెంచుకుంటున్న రాష్ర్టాలకు తక్కువ వాటా లభిస్తున్నది. ఆదాయ వ్యత్యాసంతో పాటు జనాభాకు, అటవీ, పర్యావరణానికి అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల తెలంగాణకు భారీగా నష్టం జరుగుతున్నది.