హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల మరో భారీ లేఅవుట్ రానుంది. మంచిరేవులలోని 100 ఎకరాల ప్రభుత్వ భూమిలో హెచ్ఎండీఏ అత్యాధునిక మౌలిక వసతులతో ఈ లేఅవుట్ను అభివృద్ధి చేయనున్నది. 228 సర్వే నంబర్లో ఉన్న ఈ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్లో 500 ఎకరాలు, కోకాపేటలో 533 ఎకరాల్లో అద్భుత లేఅవుట్లను తీర్చిదిద్దిన హెచ్ఎండీఏ త్వరలోనే మంచిరేవుల లేఅవుట్ పనులను ప్రారంభించే అవకాశం ఉన్నది. మంచిరేవుల గ్రామం ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉండటమే కాకుండా గండిపేట చెరువు దిగువన ఉన్న మూసీ నది పొడవునా విస్తరించి ఉండడం ఈ లేఅవుట్కు ఎంతో అనుకూలమైన అంశం. ఐటీ కారిడార్లోని మాదాపూర్, రాయిదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి మంచిరేవులకు వచ్చేందుకు ఔటర్ రింగు రోడ్డు ఎంతో సౌకర్యవంతంగా ఉంది. అదేవిధంగా మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంతోపాటు మెహిదీపట్నం నుంచి చేవెళ్ల వెళ్లే మార్గం నుంచి మంచిరేవులకు రోడ్ నెట్వర్క్ ఉండడం ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణ. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో అభివృద్ధిచేసే లేఅవుట్లకు మంచి డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.