హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో పిల్లలకు చదువు అబ్బదన్న భావన చెరిగిపోతున్నది. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల మాయ నుంచి బయటపడి తమ పిల్లలను ఏరి కోరి సర్కారు స్కూళ్లల్లో చేర్పిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగి కొత్త కళను సంతరించుకొంటున్నాయి. ఈనెల ఒకటి నుంచే కొత్త అడ్మిషన్లను ప్రారంభించేందుకు విద్యాశాఖ అనుమతించడం, ఆన్లైన్లో అడ్మిషన్లు పొందేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించేందుకు పోటీపడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ బడుల్లో వసతులు, విద్యాప్రమాణాలు గణనీయంగా మెరుగవడం.. మరోవైపు ప్రైవేట్ సూళ్ల నిర్వాహకులు ఫీజుల కోసం వేధిస్తుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని జిల్లాపరిషత్ హైస్కూల్లో 1,109 విద్యార్థులున్నారు. ఈ ఏడాది కొత్తగా మరో 300 మంది చేరారు. తెలుగు, ఇంగ్లిష్, మరాఠీ మాధ్యమాల్లో బోధన సాగుతున్న ఈ పాఠశాలలో గిరిజన విద్యార్థులకు ‘సంధ్యా సాధన’ పేరుతో తెలుగు, ఇంగ్లిష్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యాన్ని నేర్పిస్తున్నారు. పదోతరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి అవకాశాలుంటాయో వివరించేందుకు ‘చౌరస్తా’ పేరుతో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు 42 మంది ఉపాధ్యాయులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక కార్యక్రమాలతో ఆ పాఠశాల అనతికాలంలోనే గణనీయ పురోభివృద్ధి సాధించింది.
అత్యధిక విద్యార్థులున్న స్కూళ్లు విద్యార్థుల సంఖ్య
జెడ్పీహెచ్ఎస్ బోర్గాం (పీ), నిజామాబాద్ 1,390
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర), చింతలపేట, గద్వాల 1,343
జెడ్పీహెచ్ఎస్ కొండమల్లేపల్లి, నల్లగొండ 1,258
జెడ్పీహెచ్ఎస్, జగద్గిరిగుట్ట, మేడ్చల్-మల్కాజిగిరి 1,252
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కుల్సుంపుర 1,185
ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, భీంనగర్, గద్వాల 1,150
జెడ్పీహెచ్ఎస్ (బాలికలు), సంగారెడ్డి 1,094
జెడ్పీహెచ్ఎస్ ఇచ్చోడ, ఆదిలాబాద్ 1,083
జెడ్పీహెచ్ఎస్ (బాలికలు), వనపర్తి 1,083
జెడ్పీహెచ్ఎస్, శేరిలింగంపల్లి, రంగారెడ్డి 1,071
జెడ్పీహెచ్ఎస్ (బాలురు), వనపర్తి 1,061
జెడ్పీహెచ్ఎస్ ధారూరు, జోగులాంబ గద్వాల 1,058
జెడ్పీహెచ్ఎస్, రామచంద్రాపురం, సంగారెడ్డి 1,047
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఫిలింనగర్, హైదరాబాద్ 1,037
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలికలు),
సంకులమ్మగుట్టమెట్టు, గద్వాల 1,025
జెడ్పీహెచ్ఎస్, శివరాంపల్లి, రంగారెడ్డి 1,017
జెడ్పీహెచ్ఎస్, హయత్నగర్, రంగారెడ్డి 1,013
ప్రభుత్వ ఉన్నత పాఠశాల దరిచేబవాహీర్,
కిషన్బాగ్, హైదరాబాద్ 1,010
బోరబండ ఉన్నత పాఠశాలలో 30 సెక్షన్లు
రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా బోరబండ పాఠశాలలో 2,275 మంది విద్యార్థులున్నారు. ఉన్నత పాఠశాలలోని 1,625 మంది విద్యార్థుల్లో 1,239 మంది ఇంగ్లిష్ మీడియంలో, 386 మంది తెలుగు మీడియంలో 386 విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో క్లాసుకు 6 సెక్షన్ల చొప్పున 6 నుంచి పదోతరగతి వరకు మొత్తం 30 సెక్షన్లు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 268 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వీరిలో 105 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చినవారే. ఇదే ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో 650 మంది చదువుతున్నారు. ఇటీవల ఈ పాఠశాలను నాట్కో సంస్థ దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పించింది.