హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): మాజీమంత్రి, గిరిజన ఆరాధ్యనేత టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం అర్థరాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గిరిజన ప్రజల సమస్యలకోసం ఆయన ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చందూలాల్ మృతిపట్ల రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం తెలిపారు. చందూలాల్ పార్థివ దేహాన్ని స్వస్థలానికి తరలిస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు (ప్రస్తుతం ములుగు జిల్లా) మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన చందూలాల్ గిరిజన విద్యార్థి నాయకుడిగా, స్పెషల్ టీచర్గా ఉద్యోగం పొంది గిరిజనుల్లో విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. రాజకీయాల పట్ల ఆకర్షితుడై టీడీపీలో చేరారు. తన సొంత ఊరుకు సర్పంచ్గా పనిచేసి అనతి కాలంలోనే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గిరిజనుల ప్రతినిధిగా చందూలాల్ని గుర్తించారు. వ్యక్తిగతంగా మంచిపేరు ఉండటం, తమ జాతి సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధతో పనిచేయటం వల్ల ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. మంత్రిగా, ట్రైకార్ చైర్మన్గా ఆయన వ్యవహరించారు. మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటింపచేయటంలో ఆయన కీలక భూమిక పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కాలంలో ఆయన 2005లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్కు సన్నిహితుల్లో ఆయనొకరుగా ఎదిగారు.
పలువురు మంత్రులు, నేతల సంతాపం
చందూలాల్ గిరిజనుల సమస్యల పరిష్కారంకోసం తానెప్పుడూ పరితపించేవారని మంత్రి కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. సహృదయత కలిగిన నేతగా చందూలాల్ నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో మాజీ మంత్రి చందూలాల్ది ప్రత్యేక స్థానమని మంత్రి హరీశ్రావు కొనియాడారు. చందూలాల్ మరణం పట్ల సంతాపాన్ని తెలిపారు. మాజీ మంత్రి చందూలాల్ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజనశాఖ మంత్రిగా చందూలాల్ చేసిన సేవలు మరచిపోలేనివని మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. చందూలాల్ తాను ఒకే ఆలోచనావిధానంతో రాజకీయాల్లో ఎదిగామని, ఆయన మరణం తనకు తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు. చందూలాల్ మృతి టీఆర్ఎస్ పార్టీకి, గిరిజన సమాజానికి తీరని లోటని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ సంతాపం తెలిపారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి చందూలాల్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్ ములుగు శాసనసభ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రి పదవి చేపట్టి గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషిచేశారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా పనిచేసిన చందూలాల్ , నూతన తెలంగాణ రాష్ట్రంలో తన క్యాబినెట్లో గిరిజన సంక్షేమ, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మంత్రిగా రాష్ర్ర్టానికిచేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.