హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కరోనాను సమర్థంగా ఎదుర్కోవాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలి. అందుకు దేశంలోని 64 శాతం జనాభాకు వ్యాక్సిన్ ఇవ్వాలి. జనవరి నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభమైనా, ఇప్పటికి పదిశాతం మందికే వ్యాక్సిన్ మొదటి డోస్, రెండు శాతం మందికి రెండు డోసులు ఇచ్చారు. జూలై నాటికి 30 కోట్లమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ లక్ష్యాన్ని చేరుకొనేందుకు రోజుకు కనీసం 48 లక్షలమందికి వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం ఇస్తున్నది 15.5 లక్షల మందికి మాత్రమే. డిమాండ్ పెరగటం, అదే సమయంలో ఉత్పత్తి తగినంతలేకపోవటంతో టీకా లక్ష్యాన్ని చేరుకోవటం కష్టంగా మారింది. దీనికంతటికీ కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సరిగ్గా లేకపోవటమే కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే 18 ఏండ్ల పైబడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురికి వ్యాక్సిన్ వేయాలి. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ కష్టసాధ్యమేనని నిపుణులు పేర్కొంటున్నారు.