హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): భోజన ప్రియుల నోరూరించే కొర్రమీను చేపల పెంపకంపై మత్స్యశాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపడుతున్నది. ఇతర జాతుల చేపలతోపాటు కొర్రమీను ను పెంచడం సాధ్యంకాదు. ఎందుకంటే ఇతర చేప పిల్లలను కొర్రమీను చేపలు తినేస్తాయి. అందుకే వచ్చే ఏ డాది ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన చెరువుల్లో కొత్త పద్ధతుల్లో కొర్రమీను పెంచాలని నిర్ణయించింది. బెంగళూరులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్ (సిఫా)తో మత్స్యశాఖ త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నది. కొర్రమీనుకు దక్షిణ భారతదేశంలో భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ.. అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అద్భుత ఫలితాలు ఇస్తున్నది. ఈ ఏడాది 93 కోట్ల చేప పిల్లల పంపిణీ చేయనున్నది. ఏటా ఈ పథకం కింద చేప పిల్లల కొనుగోలుకు ప్రభుత్వం రూ.100 కోట్ల వరకు ఖ ర్చు చేస్తున్నది. అవసరమయ్యే చేప పిల్లల్ని ఇక్కడే ఉత్పత్తి చేసేలా మత్స్యశాఖ యోచిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల కింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలని భావిస్తున్నది. ప్రతి ప్రాజెక్టు పరిసరాల్లో మత్స్యశాఖకు 10-20 ఎకరాల స్థలం ఇవ్వాలని నీటిపారుదలశాఖను కోరిం ది. త్వరలోనే రెండుశాఖల అధికారులు భేటీ కానున్నారు. స్థలం ఇచ్చేందుకు నీటిపారుదలశాఖ అంగీకరిస్తే.. అక్కడ బహుళ ప్రయోజనాలు కలిగేలా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తామని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తెలిపారు. ప్రస్తుతం కొన్ని చెక్ డ్యాంలకే పరిమితమైన చేపల పెంపకాన్ని.. ఇకపై అన్ని చెక్ డ్యాంలలో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.