ఆదిలాబాద్: చాయ్ తయారు చేసుకోవాలంటే సాధారణంగా అల్యూమీనియం పాత్రనో, ఇత్తడి పాత్రనో, రాగి పాత్రనో లేదంటే స్టీల్ పాత్రనో ఇంకా ఇతర ఏదైనా లోహపు పాత్రనో వినియోగిస్తాం. కానీ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాయ్ వాలా హన్నూ భాయ్ మాత్రం పేపర్ బౌల్లో చాయ్ తయారు చేస్తాడు. కాగితపు గిన్నెను పొయ్యిమీద పెట్టి దానికింద మంటపెట్టినా పేపర్ కాలిపోకుండా చాయ్ చేసి చూపిస్తున్నాడాయన. మరి అది ఎలా సాధ్యమో మనం కూడా తెలుసుకుందామా..?
ఆదిలాబాద్ జిల్లాలోని చాందాటి గ్రామానికి చెందిన షేక్ హన్నూభాయ్ గత 20 ఏండ్లుగా చాయ్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన కాగితపు గిన్నెలో చాయ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. దాంతో హన్నూ భాయ్ చాయ్కి స్థానికంగా డిమాండ్ బాగా పెరిగిపోయింది. కొన్ని నెలల క్రితం ఓ ఆదివాసి గూడెంలో మోదగాకుల్లో చాయ్ తయారు చేయడాన్ని హన్నూ చూశాడట. దాంతో తాను కూడా ఎప్పటిలాగే కాకుండా డిఫరెంట్గా చాయ్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడట.
అందులో భాగంగానే న్యూస్ పేపర్నుగానీ, మరేదైనా కాగితాన్ని గిన్నెలా చుట్టి అందులో పాలు, నీళ్లు పోసి మంటపై పెట్టి చాయ్ తయారు చేయడం మొదలుపెట్టాడు. మంటపై పెట్టినా పేపర్ కాలిపోకుండా ఉంటుండటంతో ఇక పేపర్ బౌల్లో చాయ్ చేయడం కంటిన్యూ చేశాడు. ఆ చాయ్ రుచికి కూడా ఉండటంతో డిమాండ్ అమాంతం పెరిగింది. అందుకే, తన పేపర్ చాయ్ చాలా రుచిగా ఉంటుందని, చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తన దగ్గర చాయ్ కోసం వస్తారని హన్నూ భాయ్ చెబుతున్నాడు.
హన్నూభాయ్ కాగితపు పాత్రలో చాయ్ తయారు చేస్తానంటే ముందుగా ఎవరూ నమ్మలేదట. కాగితపు పాత్ర నిప్పుల మీద పెడితే కాలిపోకుండా ఉంటుందా..? అని ఎగతాళి చేశారట. కానీ, హన్నూ భాయ్ వాళ్ల కండ్ల ముందే పేపర్ బౌల్లో చాయ్ తయారుచేసి చూపించేసరికి ఆశ్చర్య పోయారట. ఇప్పుడు ఆ చాయ్ రుచికి అలవాటు పడిన తర్వాత అడిగి మరీ పేపర్ బౌల్లో చాయ్ తయారు చేయించుకుంటున్నారట.
అయితే, కాగితపు గిన్నెను నిప్పులమీద పెట్టినా కాలిపోకపోవడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని అదిలాబాద్ జిల్లాకు చెందిన సైన్స్ ఆఫీసర్ రఘు రమణ చెప్పారు. తడి, పొడి కాగితాల జ్వలన ఉష్ణోగ్రతల్లో తేడా ఉంటుందని, హన్నూ భాయ్ కాగితపు గిన్నెను మంటపై పెట్టడానికి ముందు దానిలో పాలు, నీళ్లు పోస్తున్నాడని, దాంతో కాగితం తడిసి దాని జ్వలన ఉష్ణోత్ర పెరుగుతుందని, ఆ కారణంగానే కాగితం కాలిపోకుండా ఉంటుందని రఘు రమణ వివరించారు.