విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు
‘సైబర్’ కాంగ్రెస్కు శ్రీకారం చుట్టిన విద్య, పోలీసుశాఖలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం
విద్యానగర్, మే 25 : సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కకుండా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగా హన కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ, మహిళా రక్షణ విభాగం, పోలీసులు సయుక్తంగా ‘సైబర్ కాంగ్రెస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు సైబర్ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. ఆన్లైన్ తరగతుల నేపథ్యంలో సెల్ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా విద్యార్థులు ఎక్కువ సమయం ఇంటర్నెట్ను వినియోగిస్తుండడం, అనవసర లింక్లను క్లిక్ చేయడం, బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన విద్య, పోలీసుశాఖలు సైబర్ నేరాలపై అవ గాహన కల్పించాలని నిర్ణయించాయి. ఇందులో భాగం గా షీటీం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో బృందాలను ఏర్పా టు చేసి ‘సైబర్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న 50 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ప్రతి పాఠళాల నుంచి ఒక టీచర్తోపాటు 8,9,10 తరగతుల నుంచి ఇద్దరు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరు బాలురు, ఒకరు బాలిక ఉంటారు. అలాగే స్థానిక పోలీ సు షీటీం సిబ్బంది, డీఎస్పీ సభ్యులుగా ఉంటారు. వీరికి పది నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ‘సైబర్ నేరాలు-అప్రమత్తత’పై అవగాహన కల్పిస్తారు. ఆన్లైన్ మోసాలు, ఫేస్బుక్, వాట్సాప్ వేదికలపై చోటుచేసుకునే అనుచిత ధోరణులకు ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి నెలలో వారం రోజుల పాటు ఆన్లైన్ ద్వారా సైబర్ నేరా ల నియంత్రణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అలాగే విద్యావేత్తలు, మేధావులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. 50 బృందాల పేరు మీద 50 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తారు. గ్రూప్లో డీఈవోతోపాటు సైబర్ కాంగ్రెస్, షీటీం అధికారులు ఉం టారు. ప్రతి వారం సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ఆన్లైన్లో శిక్షణ పొందిన ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు కలిసి పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిం చాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.
సైబర్ నేరాలను అరికట్టవచ్చు..
విద్యార్థులు సైబర్ మోసగాళ్ల ఉచ్చుకు చిక్కుతున్నారు. సైబర్ కాంగ్రెస్ ద్వారా అవగాహన తరగతులు నిర్వహించడం ద్వారా నేరాలను అరికట్టవచ్చు. ప్రతి విద్యార్థి స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తు న్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై,ఆన్లైన్ మోసాలపై వారికి అవగాహన ఉండాలి.
-గంగకిషన్, జిల్లా కో-ఆర్డినేటర్