గేదెల దాడిలో చిరుతకు తీవ్రగాయాలు
జూకు తరలించిన అటవీ శాఖ అధికారులు
కోయిలకొండ, జూన్ 10 : ఆకలితో కొండ దిగి పశువుల పాకలో గేదెలపై దాడి చేయబోయిన చిరుత చిక్కులో పడింది. ఒక్కసారిగా గేదెలు ప్రతి దాడికి పాల్పడడంతో కాళ్లు, నడుముకు గాయాలైన ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం బూర్గుపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు, ఎస్సై నరేశ్గౌడ్ కథనం మేరకు.. బూర్గుపల్లి మల్దేవరగుట్ట సమీపంలో రైతు నవాజ్రెడ్డి పొలంలోని పశువుల పాకలో ఆరు గేదెలు, దూడలు ఉన్నాయి. గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో చిరుత కొండ కిందకు వచ్చి పశువుల పాకలో గేదెలపై దాడి చేయగా, అవి ఒక్కసారిగా తాళ్లు తెంపుకొని చిరుతపై దాడి చేశాయి. దీంతో చిరుత ముందరి రెండు కాళ్లు, నడుము భాగంలో గాయాలు కావడంతో కదలలేని స్థితిలో పడింది. ఉదయం పొలానికి వచ్చిన రైతు నవాజ్రెడ్డి.. గాయపడిన చిరుతను గమనించి ఎస్సై సురేశ్గౌడ్కు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ జిల్లా అధికారి గంగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతను నెహ్రూ జూకు తరలించారు. గాయపడిన చిరుత వయస్సు మూడేండ్లు ఉంటుందని తెలిపారు. కాగా, చిరుత దాడిలో గాయపడిన పశువులకు వెటర్నరీ డాక్టర్ నరేందర్ చికిత్స అందించారని డీఎఫ్వో తెలిపారు. అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రయ్య, సెక్షన్ అధికారులు నరేందర్, నిరంజన్, రజనీకాంత్, శ్రీనివాసులు, సాదీక్, బీట్ ఆఫీసర్లు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.