భద్రాద్రి జిల్లా పూసుకుంట గ్రామస్తులతో గవర్నర్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ దమ్మపేట/దమ్మపేట రూరల్: ‘ట్రాక్టర్, ఎడ్లబండి వెళ్లగలిగే దారి మాత్రమే ఉన్న గ్రామానికి అంబులెన్స్ ఎలా వస్తున్నది?’ ఇది గవర్నర్ తమిళిసైకి వచ్చిన సందేహం. గురువారం పుదుచ్చేరి రాజ్నివాస్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంటలో సర్వేచేస్తున్న అధికారులతో ఆమె వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు రహదారుల సమస్యను ప్రస్తావించారు. అటవీశాఖ అనుమతి లేక గ్రామానికి రహదారి సౌకర్యం రాలేదని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు వివరించారు. దీంతో గవర్నర్ పై ప్రశ్న సంధించారు. పేషెంట్లను ట్రాక్టర్, ఎడ్లబండి మీద తారు రోడ్డు వరకు తీసుకెళ్తామని, అక్కడినుంచి అంబులెన్స్లో తరలిస్తామని ప్రజాప్రతినిధులు సమాధానమిచ్చారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరిస్తానని గవర్నర్ అభయమిచ్చారు. అంతరిస్తున్న ఆదివాసీ తెగ కొండరెడ్లపై నిర్వహిస్తున్న సర్వే వివరాలను గవర్నర్ కార్యదర్శి భవానీశంకర్ ఆమెకు వివరించారు. ఆదిమజాతి గిరిజన తెగల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేలా త్వరలో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని గవర్నర్ పేర్కొన్నారు.