హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంతోపాటు, పరిస్థితి తీవ్రం గా ఉన్న రోగుల ప్రాణాలు కాపాడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్ల పరిస్థితి, అందుబాటులో ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల వివరాలు, ఇతర పరిస్థితుల పర్యవేక్షణను ఐఏఎస్ అధికారులకు అప్పగించాలని నిర్ణయించింది. హైదరాబాద్లోని ప్రధాన కొవిడ్ దవాఖానలైన గాంధీ, టిమ్స్, చెస్ట్, ఉస్మానియా దవాఖానలను సీనియర్ ఐఏఎస్ అధికారులకు, అన్ని జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నది. ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్సహా అన్నిజిల్లాల్లో ప్రభుత్వ ప్రధాన దవాఖానల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నారు. దాదాపు 50 వేలకుపైగా బెడ్లను ప్రభుత్వం సిద్ధంచేసింది. అయితే కరోనా సోకినవారిలో చాలామంది ఆందోళనతో ఆగమాగమవుతున్నారు. పాజిటివ్ అని తేలగానే ఆక్సిజన్ బెడ్ల కోసం ఆరా తీస్తుండగా, మరికొందరు రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్ల కోసం పరుగులు పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రైవేటు నర్సింగ్ హోంలకు వెళ్లిన బాధితులకు అక్కడి వైద్యులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల మధ్య పూర్తిస్థాయి సమన్వయం లేకపోవడంతో పడకలు, పేషెంట్ల వివరాలపై సరైన సమాచారం ఉండటం లేదు. దీంతో కొన్నిచోట్ల ఖాళీ పడకలు ఉన్నప్పటికీ, ఎక్కువ సంఖ్యలో వస్తున్న పేషెంట్లను అక్కడికి తరలించడంలో కాస్త ఆలస్యమవుతున్నది. ఆయా దవాఖానల డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు అధిక ఒత్తిడితో పూర్తిస్థాయిలో వైద్యంపై దృష్టి సారించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తతున్నాయి. దీనికి పరిష్కారంగా కొవిడ్ చికిత్స అందిస్తున్న ప్రభుత్వ దవాఖానల మధ్య బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
కొవిడ్ రహిత రాష్ట్రమే లక్ష్యం
కొవిడ్ పరిస్థితులు మెరుగుపడేదాకా ఐఏఎస్లు దవాఖానల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జిల్లాల్లో కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకొంటారు. ఆక్సిజన్ సరఫరా, రెమ్డెసివిర్ సహా ఇతర మందులు, పడకల ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి సారిస్తారు. సిబ్బంది కొరత ఉన్నచోట తక్షణం సిబ్బందిని నియమిస్తారు. అవసరమైతే సమీపంలో అదనంగా ఉన్న సౌకర్యాలను తక్షణం వినియోగించుకుంటారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించటానికి చొరవ చూపనున్నారు.