కుత్బుల్లాపూర్, మార్చి 24: టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య చాలా వరకు తీరిందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గడిచిన నాలుగైదు ఏండ్ల నుంచి నగరంలో తాగునీటి సమస్య లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ మంచినీరు అందిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తరిస్తూ 30 సర్కిళ్లు, ఆరు జోన్లు ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు సేవలను మరింత దగ్గర చేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాను అనుసరించి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా తాగునీటి సరఫరాకు 250కోట్లు అదనంగా కేటాయించాలని కోరారు. అర్హులైన ప్రతి ఇంటికీ ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు అందిస్తుండటంపై ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. అయితే బల్క్ వాటర్ కనెక్షన్ నుంచి వ్యక్తిగత కనెక్షన్కు మారేందుకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.