హైదరాబాద్, జూన్ 18, (నమస్తే తెలంగాణ): తక్కువ ధరల్లో సరుకు రవాణాచేస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రజలకు దగ్గరైంది ఆర్టీసీ కార్గో సర్వీస్. సేవలను ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే 32 లక్షల పార్సిళ్లను గమ్యస్థానాలకు చేర్చింది. పార్సిల్, కార్గో రవాణా ద్వారా రూ.46 కోట్ల ఆదాయంతో విజయవంతంగా కొనసాగుతున్నది. సంస్థను ఆర్థికంగా కాపాడుకోవడంతోపాటు ప్రజలకు సరుకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో గతేడాది జూన్ 19న ఆర్టీసీ పార్సిల్, కార్గో సేవలను ప్రారంభించింది. కార్గోతోపాటు, పార్సిళ్లను చేరవేస్తూ అందిస్తున్న సేవలకు మంచి స్పందన వచ్చింది. పార్సిల్ సర్వీస్తో రూ.34 కోట్లు, కార్గో రవాణాతో రూ.12 కోట్ల ఆదాయం పొందింది. వినియోగంలోలేని కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు కార్గో సర్వీస్లుగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10 టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో వాహనాలు 150, నాలుగు టన్నుల సామర్థ్యంఉన్న 32 బస్సులు అందుబాటులో ఉన్నాయి. 177 బస్స్టేషన్ కౌంటర్లు, 810 మంది ఏజెంట్లతో నమ్మకమైన సేవలను అందిస్తున్నది. టీఎస్ఫుడ్స్, ఎఫ్సీఐ, మహిళాశిశు సంక్షేమశాఖ, ఆరోగ్యశాఖ, మందుల రవాణా, ఇంటర్మీడియట్బోర్డు తదితర ప్రభుత్వ విభాగాలు కార్గో సేవలను ఎంతగానో వినియోగించుకుంటున్నాయి. తెలుగు అకాడమీ పుస్తకాలను హైదరాబాద్ నుంచి మారుమూల గ్రామాల్లోని సెంటర్లకు సైతం ఆర్టీసీ చేరవేసింది. కరోనా పరిస్థితులతో కాస్త నెమ్మదించినా మళ్లీ కార్గో, పార్సిల్ సేవలు ఊపందుకోనున్నాయి.
సమిష్టి కృషితోనే ఈ విజయం
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా దినదినాభివృద్ధి చెందుతూ అతి తక్కువ సమయంలోనే టీఎస్ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొన్నాయి. ఇది ఆర్టీసీ సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమైంది. ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ మార్గనిర్దేశనంలో కార్గో, పార్సిల్ సర్వీస్ ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణకాంత్ పర్యవేక్షణలో ఈ సేవలు తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువయ్యాయి. ఏడాది పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల నుంచి ఈడీల వరకు, ఏజెంట్ల నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వరకు అందరికీ అభినందనలు.
– పువ్వాడ అజయ్కుమార్, రవాణాశాఖ మంత్రి