తెలుగు భాష ఆ యువతి శ్వాస. ఆమెకు పోతన పద్యమంటే ప్రేమ. కాళోజీ కవిత్వమంటే మక్కువ. తెలంగాణ రచయిత్రుల వచనమంటే ప్రత్యేక అభిమానం. ఆ అక్షరానుబంధమే, నవలా సాహిత్యంపై పరిశోధనకు ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగులో డాక్టరేట్ సాధించిన తొలి ముస్లిం యువతి అఫ్రీన్!
సయ్యద్ అఫ్రీన్.. అక్షరాలు దిద్దుకునే వయసులోనే తెలుగు భాషపట్ల మక్కువ పెంచుకున్నారు. తరగతి పెరిగేకొద్దీ ఆ అనుబంధం మరింత చిక్కబడింది. ఆ జిజ్ఞాసే భాషా పరిశోధకురాలిని చేసింది. ఈమధ్యే అఫ్రీన్, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం నుంచి ‘తెలంగాణ నవలా రచయిత్రులు – ఒక పరిశీలన’ అనే అంశంపై డాక్టరేట్ సాధించారు. తన మాతృభాష ఉర్దూ అయినా, తెలుగులో పరిశోధన చేసిన తొలి తెలంగాణ ముస్లిం యువతిగా అఫ్రీన్ రికార్డు సృష్టించారు. అతి తక్కువ సమయంలోనే పరిశోధన పత్రాలను సమర్పించి డాక్టరేట్ సాధించడం అఫ్రీన్ మరో ఘనత. ఇప్పటి వరకూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఏ విభాగంలోనూ మూడేండ్ల పరిమిత సమయంలో ఎవరూ పరిశోధన పూర్తి చేయలేదు.
తెలుగు కవయిత్రులపై..
అఫ్రీన్ తన పరిశోధనలో 1990 నుంచి 2015 వరకూ.. ఆధునిక తెలుగు కవయిత్రుల రచనలపై విశ్లేషణ చేశారు. 1924లో లభించిన ఆధారాల ప్రకారం మొదటి తెలుగు నవలా రచయిత్రి సీతా పిరాటమ్మతో పాటుగా మరో ఎనిమిది మందిపై పరిశోధన చేశారు. సయ్యద్ అఫ్రీన్ స్వగ్రామం కామారెడ్డి జిల్లా బాన్సువాడ. తండ్రి సయ్యద్ అబ్దుల్ లతీఫ్ జర్నలిస్టు. తల్లి రేహన్బేగం గృహిణి. బాల్యం నుంచీ తనకు తెలుగు సాహిత్యం అంటే మక్కువ. ‘తెలుగు భాషపై ఇంతగా పట్టు సాధించడానికి నేను పుట్టి పెరిగిన వాతావరణమే కారణం. మరోవైపు నాన్న తెలుగు పత్రికల్లో పని చేయడమూ నాపై ప్రభావం చూపింది. చిన్నప్పటి నుంచీ తెలుగు పత్రిక చదవడం అలవాటు. తెలుగు తెలిసినవాళ్లతో అచ్చంగా తెలుగులోనే మాట్లాడటం నాకిష్టం. యూనివర్సిటీ ప్రొఫెసర్ల సహకారంతో పరిశోధనను తక్కువ సమయంలో పూర్తి చేశాను. భవిష్యత్తులో తెలుగు ప్రొఫెసర్గా స్థిరపడాలన్నదే నా కల. నా విద్యార్థులకు తెలుగు మాధుర్యాన్ని పరిచయం చేస్తాను’ అంటారు అఫ్రీన్.