హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ డబీర్పురాలో గల బీబీ కా అలావాను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మంగళవారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మొహర్రం వేడుకకు టీఎస్ వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్త మొహర్రం నిర్వహణకు టీఎస్ వక్ఫ్ బోర్డు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. పాతబస్తీలో శుక్రవారం ఊరేగింపు నిర్వహించబడుతుందన్నారు. ఊరేగింపు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.