ఊబకాయం.. ఇది జీవితాన్నే భారంగా మారుస్తున్న బరువైన శారీరక జబ్బు. ఇప్పుడీ జబ్బు రోజురోజుకూ పిల్లల్లోనూ అధికమవుతుంది. ప్రధానంగా కరోనా కారణంగా మొన్నటి వరకు పాఠశాల, కళాశాలల విద్యార్థులంతా ఇళ్ళకే పరిమితమవడంతో చాలా మంది పిల్లల్లో ఈ ఊబకాయ సమస్య పెరిగిందని ఉస్మానియా హాస్పిటల్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాకేష్ సాహే తెలిపారు.
సాధారణంగా ఊబకాయ సమస్య అనేది మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. ఒక్కటి కాదు రెం డు కాదు పలు రకాల అనారోగ్య సమస్యలకు ఈ ఊబకా యం కారణమవుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ప్రధానంగా రోగి ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదలలేడు. తన పని తాను సులువుగా చేసుకోలేడు. చిన్న పనికి కూడా ఆయాస పడటం, నీరసించి పో వడం జరుగుతుంది. ఊబకాయ సమస్య వల్ల ప్రధానంగా గుండెపోటు, అధిక రక్తపోటు తదితర రోగాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 2.1బిలియన్ ఊబకాయులు ఉండగా, మన దేశంలో వీరి సంఖ్య 30.2 మిలియన్లు ఉం దని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఊబకాయ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. నగరానికి వస్తే ఊబకాయుల సంఖ్య నగర జనాభాలో 20.3 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాలలోనే ఈ సమస్య అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఊబకాయ సమస్యకు మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రధానంగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిన ప్రజల్లో శారీరక శ్రమ తగ్గింది. యాంత్రిక జీవనంతో శారీరక శ్రమ లేకుం డా పోయింది. దీనికి ఆహారపు అలవాట్లు సైతం తోడయ్యాయి.
ఊబకాయం నుంచి విముక్తి పొందాలంటే ప్రధానంగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతి రోజు తప్పనిసరిగా కనీసం అరగంట పాటు వ్యాయామం, వీలైనంతగా నడవడం, యోగాసనాలు వంటివి చేయడం ఉత్యుత్తమం. తీపి పదార్ధాలను పరిమితం గా తీసుకోవాలి. మాంసాహారం, కొవ్వు పదార్ధాలు తగ్గించాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ఫుడ్లు, కూల్డ్రింక్స్ తీసుకోరాదు. తల్లిదండ్రులు పిల్లలను ఎంతసేపు చదువు, స్కూలు, ట్యూషన్, హోమ్ వర్క్ అని కూర్చోబెట్టకుండా, ఆటలు ఆడేందుకు పిల్లలను పోత్సహించాలి. సెల్ఫోన్స్, ట్యాబ్స్ వంటి గ్యాడ్జెట్స్ను అలవాటు చేయకూడదు. – డా॥ సాహె, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి, ఉస్మానియా
బంజారాహిల్స్, మార్చి 4: ప్రపంచ వ్యాప్తం గా అధిక బరువుతో కోట్లాది మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడిన జీవన విధానాల వల్ల ఊబకాయం సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా ఇటీవల ఒబేసిటీ కేసులు భారీగా పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారన్నారు. బరువు పెరగడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని, ప్రధానంగా మధుమేహం, రక్తపోటు, గుండెపోటుకు దారి తీస్తాయన్నారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో పాటు సరైన వ్యాయామం వల్ల కొంతమేర ఊబకాయం సమస్యలు తగ్గించుకోవచ్చన్నారు. ఒబేసిటీపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బేరియాట్రిక్ విభాగం అధిపతి డా॥ కృష్ణమోహన్, కేర్ ఆస్పత్రి సీవోవో డా॥ నిఖిల్ మాధుర్, రాహుల్ మేథక్కర్ పాల్గొన్నారు.
ఖైరతాబాద్, మార్చి 4: ‘12 ఏండ్ల ప్రాయంలోనే మధుమేహం వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ప్రమాదానికి హేతువు. వయస్సుతో పాటు ప్రాణాంతక జబ్బులు వస్తాయి. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ భారతదేశంలో 14.4 మిలియన్ల పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని, ప్రపంచంలోనే చైనా తర్వాత స్థానంలో ఉన్నామన్నారు. పిల్లల్లో అధిక బరువు, ఊబకాయం ప్రాబల్యం 15 శాతం ఉందని, ఉన్నత, ఆదాయ కుటుంబాలకు చెందిన పిల్లలు 35 నుంచి 40 శాతం ఈ సమస్యతో బాధపడుతున్నారన్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, డైస్లిపిడెమియా, హైపర్టెన్షన్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు, స్టీటోహైపటైటీస్, గ్యాస్ట్రో ఏసోఫాగియల్ రిఫ్లక్స్, ఆర్థరైటీస్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయన్నారు. సదస్సులో ఒబెసిటీ డయాబెటీస్ బేరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ డాక్టర్ సురేందర్ ఉగలే, డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎన్జి శాస్త్రి, విరించి హాస్పిటలల్స్ చీఫ్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డాక్టర్ దిలిప్ గుడే, ప్రముఖ పోషకాహార నిపుణురాలు అపర్ణ నెమలికంటి పాల్గొన్నారు.