హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని హోం మంత్రి మహముద్ అలీ పేర్కొన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సోమవారం మహముద్ అలీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీం, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వక్ఫ్ బోర్డు సీఈవో షావానాజ్ ఖాసింతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అనధికార ఆక్రమణల తొలగింపు కోసం సకాలంలో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై తాజా సమాచారాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసిం అందించారు. వక్ఫ్ బోర్డు బాగా పనిచేస్తోందని, సిబ్బంది తక్కువగా ఉన్నారని, ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఖాసిం పేర్కొన్నారు.