హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఢిల్లీలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవులు ప్రకటిస్తున్నటుల్ సీఎం తెలిపారు.
ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, మున్సిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ, రోడ్లు భవనాల శాఖల అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడాలని సీఎస్ సూచించారు. ఇదిలా ఉండగా.. గులాబ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాలు రెడ్ అలెర్ట్, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.