హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 3వ సెషన్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం రాత్రి విడుదలచేసిన ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు పెద్దసంఖ్యలో అడ్వాన్స్కు అర్హత సాధించారు. నలుగురు విద్యార్థులు పోలు లక్ష్మీసాయి లోకేశ్రెడ్డి, మాధుర్ ఆదర్శ్రెడ్డి, వెలవాలి వెంకట కార్తికేయ సాయి వైదిక్, జ్యోసుల వెంకట ఆదిత్య 100 పర్సంటైల్ సాధించారు. ముఖ్యంగా తెలంగాణ గురుకులాలకు చెందిన 932 మంది జేఈఈ అడ్వాన్స్కు అర్హత సాధించారు. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని విద్యార్థులు 539 మంది, గిరిజన గురుకులాల పరిధిలోని విద్యార్థులు 393 మంది ఉన్నారు. మహిళా విభాగంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల లింగావారిగూడెం గ్రామానికి చెందిన పల్లె భావన ఆలిండియా నాలుగో ర్యాంక్ సాధించారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నందిగామ నిఖిల్ 99.997 పర్సంటైల్తో ఎస్సీ క్యాటగిరీరిలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. ఓబీసీ క్యాటగిరీ టాపర్స్లో జీ శ్రీలక్ష్మి ఉన్నారు. ఎస్టీ క్యాటగిరీలో టాప్-5లో ముగ్గురు తెలంగాణకు చెందిన బిజిలీ ప్రచోతన్ వర్మ, నీనావత్ ప్రీతమ్, ఇస్లావత్ నితిన్ ఉన్నారు. పీడబ్ల్యూడీ క్యాటగిరీలో టాప్-5లో మల్లుకుంతల భానురంజన్రెడ్డి ఉన్నారు. మహిళా క్యాటగిరీ టాప్-10లో తెలంగాణకు చెందిన నలుగురు కొమ్ము శరణ్య, పల్లె భావన, జీ శ్రీలక్ష్మి, అంచ ప్రణవి ఉన్నారు.
జేఈఈ మెయిన్స్-2021 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 17 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. వారిలో ఆరుగురు తమ విద్యార్థులేనని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ర్టాల నుంచి ఎనిమిది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధిస్తే.. వారిలో ఐదుగురు నారాయణ విద్యార్థులేనని పేర్కొన్నారు.