సిద్దిపేట అర్బన్, మే 7: సిద్దిపేటలోని పారుపల్లివీధి భోగేశ్వరాలయం వద్ద వీరగల్లు విగ్రహాలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్ తెలిపారు. భోగేశ్వరాలయం వద్ద నాలుగు రాతి స్తంభాల నడుమ భూమి లోపలికి నడుము వరకు పాతి ఉన్న వీరుని శిల్పం కనిపించిందని పేర్కొన్నారు. ఇక్కడ యుద్ధంలో మరణించిన వీరులతోపాటు ఆత్మాహుతి శిలలు ఉన్నాయన్నారు. ఊరు, ఊరిలోని పిల్లలు, స్త్రీలు, పశువులు, సంపదలను కాపాడటానికి దొంగలతోనో, పరాయి సైనికులతోనో, క్రూర జంతువులతోనో ఈ వీరులు పోరాడేవారని తెలిపారు. ఆ పోరులో అమరులైన వీరుల పేరిట గ్రామస్థులు, పాలకులు నిలిపిన స్మారకశిలలే ఈ వీరగల్లు విగ్రహాలని వివరించారు. ఈ వీరుల్లో మతం కోసం తలను, శరీరంలోని అంగాలను అర్పించేవారని, ముఖ్యంగా వీరశైవులలో ఈ పద్ధతి ఎక్కువగా కనిపించేదని చరిత్ర బృందం సభ్యులు తెలిపారు. ఈ ఆత్మాహుతి వీరుల పేరిట కూడా వీరగల్లు విగ్రహాలు ఉన్నాయన్నారు. భర్త మరణిస్తే తాము కూడా ప్రాణత్యాగం చేసిన స్త్రీల పేరిట వేసిన సతిశిలలు కూడా ఇక్కడ గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు తెలిపారు.