మొయినాబాద్ : మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చేవెళ్ల, పూడురు, పరిగి, షాబాద్, మొయినాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. మొయినాబాద్ మండల పరిధిలోని అమ్డాపూర్ గ్రామ సమీపంలో ఉన్న వంతెన వద్ద ఈసీ వాగు ఉప్పొంగడంతో వాగుకు ఇరువైపుల అర కిలోమీటరు దూరంలో వరద నీరు విస్తరించుకుంటూ ప్రవహించింది. వాగుకు ఇరువైపుల ఉన్న పంట పొలాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్న హిమాయత్సాగర్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగుకు ఇరువైపుల ఉన్న అమ్డాపూర్, బాకారం, నాగిరెడ్డిగూడ, కాశీంబౌలి, శంషాబాద్ మండల పరిధిలోని కేబీ దొడ్డి, సుల్తాన్పల్లి గ్రామాల పంట పొలాలు ఈసీ వాగుకు అనుకుని ఉండటంతో పంట పొలాలోకి వరద నీరు చేరి పంటలు మునిగిపోయాయి. రైతుల చేతికి పంట వచ్చే సమయంలో పంటలు వరద నీటిలో మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సుమారుగా 3 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
10గేట్లు ఎత్తి దిగువకు వదిలిన వరద నీరు
హిమాయత్సాగర్ జలాశయంలోనికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జలాశయంలోని నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. ఉదయం 11 గంటలకు 4గేట్లు ఎత్తి వరద నీరు దిగువకు వదిలారు. జలాశయంలోనికి వరద ఉధృతి ఎక్కువ కావడంతో 12గంటలకు ముందు 8గేట్లు ఎత్తారు. భారీగా ఇన్ప్లో ఉండటంతో 12 గంటలకు అధికారులు 10 గేట్లు ఎత్తారు. జలాశయం నుంచి వరద నీరు దిగువ ప్రాంతానికి వదలడంతో గేట్లు చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున జలాశయానికి చేరుకున్నారు.