దవాఖానల్లో చిన్నపిల్లలకు బెడ్ల సంఖ్యను పెంచుకోవాలి
ఆరు నెలల నుంచి 14 ఏండ్లలోపు పిల్లల సర్వే చేపట్టాలి
అధికారులతో సమీక్షలో మంత్రి
ఇందూరు, జూన్ 6: కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో కరోనా థర్డ్ వేవ్పై ప్రభుత్వ, పిల్లల వైద్య నిపుణులతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొవిడ్ థర్డ్ వేవ్ ఉంటుందని, ఇప్పటికే మహారాష్ట్రకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందనే విషయం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. థర్డ్వేవ్ను ఎదుర్కోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
దవాఖానల్లో పిల్లలకు అవసరమైన బెడ్ల సంఖ్యను పెంచుకోవాలని, మందులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పిల్లల వైద్య నిపుణులు తిలక్నగర్ దవాఖాన నుంచి నర్సింగ్ స్టాఫ్ను ఇక్కడికి తీసుకొచ్చి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. థర్డ్ వేవ్పై ప్రజల్లో అవగాహన పెంచాలని, దవాఖానలో చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లిన అనంతరం చెట్ల మందులు, పసర్లు వాడకుండా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. మరోసారి ఇంటింటి సర్వే చేపట్టి ఆరు నెలల నుంచి 14 ఏండ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రుల వివరాలను సేకరించాలని కలెక్టర్కు సూచించారు. సమావేశంలో కలెక్టర్ నారాయణరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ వీజీగౌడ్, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.