భోపాల్: బావ వరుస అయ్యే ఇద్దరితో ఫోన్లో మాట్లాడిన ఇద్దరు యువతులను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పిపాల్వా గ్రామంలోని గిరిజన తెగకు చెందిన 19, 20 ఏండ్ల యువతులు తల్లి సోదరుడి కుమారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సోదరుడి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు ఆ ఇద్దరు యువతులను స్కూల్ సమీపంలో అడ్డుకుని కర్రలతో దారుణంగా కొట్టారు. జూన్ 22న జరిగిన ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లో చిత్రీకరించగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాండా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి విజయ్ వాస్కలే దీనిపై జూన్ 25న స్పందించారు. ఒక యువతిని పోలీస్ స్టేషన్కు రప్పించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.