హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాఢ మాస బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని ఆయన గుర్తుచేశారు.‘‘ఈ ఏడాది ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రూ.15 కోట్లు మంజూరు చేశారు. జూలై 11న గోల్కొండ బోనాలు, 25న సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1న హైదరాబాదు బోనాల ఉత్సవాలు ఉంటాయి. 25న జరిగే అత్యున్నతస్థాయి సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, మహేష్ భగవత్, సజ్జనార్, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారు’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు.