హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమున హేచరీస్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న భూ వివాదంలో కెనరా బ్యాంకు పిటిషన్ దాఖలుచేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. బ్యాంకు దాఖలుచేసిన ఇంప్లీడ్ పిటిషన్ను విచారించేందుకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి నిరాకరించారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని 59 ఎకరాల భూమి లో రెవెన్యూ, సర్వే అధికారులు జోక్యం చేసుకోకుండా చూడాలని జమున హేచరీస్.. హైకోర్టులో పిటిషన్ వేసింది.
జమున హేచరీస్కు రుణం ఏ ప్రాతిపదికన ఇచ్చారని కెనరా బ్యాంకు అధికారులను ఏసీబీ వేధింపులకు గురిచేస్తున్నదని బ్యాం కు.. ఇదే కేసులో అనుబంధ పిటిషన్ వేసి హైకోర్టు దృష్టికి తెచ్చింది. స్పందించిన హైకోర్టు.. జమున హేచరీస్ కేసులో బ్యాంకు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది. బ్యాంకుకు ఏసీబీ నుంచి వేధింపులు ఉంటే విడిగా పిటిషన్ వేసుకునే వెసులుబాటు చట్టంలో ఉన్నదని గుర్తుచేసింది. జమున హేచరీస్కు బ్యాంకు రూ.93 కోట్లు రుణంగా ఇచ్చింది.
అంత భారీ రుణం ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పాలని ఏసీబీ ప్రశ్నలు సంధిస్తున్నదని బ్యాంకు వాదన. కెనరా బ్యాంకు తరఫున సీనియర్ న్యాయవాది దీపక్ భట్టాచార్జి వాదనలు వినిపిస్తూ.. జమున హేచరీస్ కేసు పేరుతో బ్యాంకు ను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘జమున హేచరీస్ భూసర్వే వ్యవహారాలకు, మీరు చెప్తున్న వాదనలకు ఎక్కడా పొంతనలేదు’ అని వ్యాఖ్యానించింది. బ్యాంకు అధికారులతో సంప్రదించాక కేసును వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలన్న బ్యాంకు తరఫు న్యాయవాది అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు.