హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అర్హులైనవారందరికీ వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. 18 ఏండ్లు పైబడినవారికి కూడా మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన ఈ నేపథ్యంలో తెలంగాణలో వ్యాక్సినేషన్కు అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో 18-45 ఏండ్ల మధ్య వయసున్నవారు ఎంతమంది ఉన్నారు? 45, ఆపైన వయసువారిలో ఇంకా ఎంతమంది టీకాలు తీసుకోలేదు? అనే లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికి ఉన్న వ్యాక్సిన్ కేంద్రాలెన్ని? 18-45 ఏండ్ల మధ్య వయసువారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఎంత మంది సిబ్బంది కావాలి? ఎన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలి? అన్నదానిపై అంచనాలు రూపొందిస్తున్నారు.
వ్యాక్సినేషన్ నిర్వహణపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆరోగ్యశాఖ అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించినట్టు సమాచారం. వ్యాక్సిన్పై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలను పోగొడుతూ, వీలైనంత త్వరగా కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం 18-45 ఏండ్ల వయసున్నవారు రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్ అందించాల్సి వస్తే సుమారు 1600 కోట్లకుపైగా ఖర్చవుతుందని అంచనావేశారు. 45ఏండ్ల పైబడినవారిలో ఇప్పటి వరకూ వ్యాక్సిన్ తీసుకోని వారికి ఎంత ఖర్చవుతుందన్న లెక్కలను కూడా అధికారులు తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానున్నది.
ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం!
ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించడంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వ స్థాయిలో సన్నద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో కూలంకుషంగా చర్చించి వ్యాక్సినేషన్పై కార్యాచరణ రూపొందిస్తారని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఇదే విషయంపై చర్చించారు. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం వ్యాక్సినేషన్పై ఏం చేస్తున్నదనేది ప్రకటించనున్నట్టు తెలిసింది.
ఏయే కంపెనీలున్నాయి?
రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజాగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆరాతీస్తున్నారు. దీంతోపాటు వేరే కంపెనీల వ్యాక్సిన్లు కూడా వచ్చే అవకాశం ఉందని కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. అనుమతులు లభించే కంపెనీల వ్యాక్సిన్లు, వాటి ప్రభావం, ధరలు అనే అంశాలపై అధికారులు దృష్టిసారించారు. కొన్ని కంపెనీల ప్రతినిధులతో కూడా ప్రభుత్వ పెద్దలు చర్చలు ప్రారంభించారు. నిపుణుల సలహాలు, సూచనలను కూడా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ కొనుగోలు చేయడం పెద్ద సమస్యకాదని, దాన్ని సమర్థవంతంగా పంపిణీ చేయడమే ముఖ్యమని ప్రభుత్వం భావిస్తున్నది. ఎక్కడా వృథా లేకుండా పంపిణీ చేయాలని, వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసి ప్రజల్లో భరోసా నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.