న్యూఢిల్లీ, జూన్ 27: కరోనా మూడో వేవ్ రావడం ఆలస్యం కావచ్చని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఆలస్యంతో దేశ ప్రజలందరికీ టీకాలు వేసేందుకు 6-8 నెలల సమయం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఐసీఎంఆర్ అధ్యయనం నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రతిరోజూ కోటి మందికి టీకాలు వేయడం తమ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ‘జైడస్ క్యాడిలా కంపెనీ వ్యాక్సిన్ జైకొవ్-డీ ట్రయల్స్ దాదాపు పూర్తయ్యాయి. జూలై చివర్లో లేదా ఆగస్టులో ఈ వ్యాక్సిన్ను 12-18 ఏండ్ల వయసు గ్రూపువారికి వేయడం ప్రారంభించే అవకాశం ఉంది’ అని చెప్పారు. జైడస్ తమ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి కోసం భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్కు త్వరలో దరఖాస్తు చేయనున్నదన్నారు. పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఒక మైలురాయి అవుతుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఇది పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి, పిల్లలు బయటకు రావడానికి మార్గం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2-18 ఏండ్ల వయసు వారి కోసం భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకా సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రావచ్చని తెలిపారు. దీని కంటే ముందే ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతి లభిస్తే పిల్లలకు అది కూడా ఒక ఆప్షన్ అవుతుందని చెప్పారు.
కరోనా నుంచి కోలుకొని..
రెండు డోసులు తీసుకున్నా..సోకిన డెల్టాప్లస్
జైపూర్: రాజస్థాన్లో 65 ఏండ్ల వయసున్న ఓ మహిళ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను కూడా తీసుకున్నారు. అయినా ఆమెకు కొత్త వేరియంట్ డెల్టాప్లస్ సోకింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యాధికారులు ధ్రువీకరించారు. ఈ రాష్ట్రంలో నమోదైన తొలి డెల్టాప్లస్ కేసు కూడా ఇదే. అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం సదరు మహిళ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.